అన్నాడిఎంకె లో కీలకపరిణామాలు,అసెంబ్లీలో సిఎం బలనిరూపణ చేసుకోవాలి
అసెంబ్లీలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని డిఎంకె డిమాండ్ చేసింది.
చెన్నై :జయలలిత మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన పన్నీర్ సెల్వం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని డిఎంకె డిమాండ్ చేసింది. అన్నాడిఎంకె లో రోజుకో కీలకపరిణామాలు చోటుచేసుకొంటున్న తరుణంలో డిఎంకె ఈ డిమాండ్ చేసింది. అయితే పన్నీర్ సెల్వం కుర్చీకి శశికళ ఎసరు పెట్టిందనే ప్రచారం కూడ పార్టీలో సాగుతోంది.
జయలలిత మరణించిన తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా భాద్యతలను స్వీకరించారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాద్యతలను చేపట్టారు. అయితే అన్నా డిఎంకెలో శశికళ శకం ప్రారంభమైంది.
అన్నా డిఎంకెలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా , ముఖ్యమంత్రిగా ఒక్కరే భాద్యతలను నిర్వహిస్తారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇదే ఆనవాయితీని కొనసాగిస్తారా లేదా అనేది కూడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు చెక్ పెట్టేందుకు శశికళ పావులు కదుపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. శశికళను ముఖ్యమంత్రిగా భాద్యతలను చేపట్టాలని పలువురు పార్టీ నాయకులు, మంత్రులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి బలం నిరూపించుకోవాలి
అన్నాడిఎంకె లో చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని డిఎంకె డిమాండ్ చేసింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం అసెంబ్లీలో బలాన్ని డిమాండ్ చేసుకోవడం పన్నీర్ సెల్వం ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే. అయితే అన్నా డిఎంకె పార్టీలో కూడ రోజుకో రకంగా పరిణామాలు మారుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రిని సిఎం పదవిని చేపడుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ పరిణామాల దృష్ట్యానే డిఎంకె సెల్వం ను బలనిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేసింది.
పన్నీర్ సెల్వం కుర్చీకి ఎసరు
ముఖ్యమంత్రి బాద్యతలు నిర్వహిస్తున్న పన్నీర్ సెల్వం కుర్చీకి ఎసరు వచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి, సెల్వం మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ మేరకు ఆయన మంత్రివర్గంలోని ఐదుగురు మంత్రులు పన్నీర్ సెల్వం స్థానంలో శశికళను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. అయితే మిగిలిన మంత్రులు, ఎంఏల్ఏలు సెల్వంకు మద్దతుగా నిలుస్తారా శశికళ వైపుకు వెళ్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
చిన్నమ్మ చక్రంతిప్పుతోంది
జయలలిత మరణించిన తర్వాత అనతికాలంలోనే చిన్నమ్మ శశికళ పార్టీ పగ్గాలను చేపట్టారు. పార్టీ కార్యవర్గం ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. ఈ బాద్యతలను ఆమె చేపట్టారు. అన్నాడిఎంకె పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి కీలకమైంది. మరో వైపు ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న శశికళే ఎన్నికల నిర్వహణ బాద్యతలను కూడ చేపట్టేలా మార్పులు చేశారు. ఈ మేరకు పార్టీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
సెల్వం కు అండదండలు ఎవరు
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు అండగా నిలిచేది ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు ఆయనతో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులు చివరి వరకు ఆయనతో నిలుస్తారా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించే సమయంలోనే శశికళ వర్గం వ్యతిరేకతను వ్యక్తం చేసినట్టుగా వార్తలువచ్చాయి.అయితే వాటిని బయటకు పొక్కకుండా సెల్వం సిఎంగా బాద్యతలను స్వీకరించారు. మరో వైపు సెల్వం తన పదవిని కాపాడుకొనేందుకుగాను ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి వరద సహయం ఇవ్వాలని కోరుతూ ప్రధానిని కలిసిన సమయంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఆయన ప్రధానితో చర్చించారని సమాచారం.
అన్నాడిఎంకె పరిణామాలను పరిశీలిస్తోన్న పార్టీలు
అన్నాడిఎంకె పార్టీలో చోటుచేసు కొంటున్న పరిణామాలను తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాయి .డిఎంకె పార్టీ కూడ ఈ పరిణామాలు తమకు కలిసివస్తాయనే అభిప్రాయంతో కూడ ఉంది. మరో వైపు బిజెపి కూడ తమ ఎదుగుదలకు తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు ఏ మేరకు కలిసివస్తాయోనని అంచనా వేస్తున్నాయి. అన్నాడిఎంకెలో జయలలిత మరణం తర్వాత తమకు కలిసివచ్చే అవకాశాలను ఏ పార్టీ కూడ విడిచిపెట్టేందుకు సిద్దంగా లేదు.
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బలాన్ని నిరూపించుకోవాలి
అన్నా డిఎంకె పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వెంటనే సమావేశపర్చాలని డిఎంకె డిమాండ్ చేస్తోంది. అధికార అన్నా డిఎంకె పార్టీకి, విపక్ష డిఎంకె కూటమికి మద్య ఎంఏల్ఏ ల మద్య వ్యత్యాసం సుమారు 20 మంది.అయితే పరిస్థితులు తారుమారైతే అన్నాడిఎంకె అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తే ఏం చేయాలనే దానిపై డిఎంకె వ్యూహరచన చేస్తోంది.