మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ, జిల్లాల నిర్బంధం: అందుకేనంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహిద్దులు ఇప్పటికే మూసేశామని ఆయన తెలిపారు. సోమవారం నుంచి జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు.
సోమవారం నుంచే రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆద్యాత్మిక కేంద్రాలను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజల్ని ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేసినా వినకపోవడం ల్లే బలవంతంగా కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆందోళన చెందాల్సని అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే 67 కేసులు నమోదయ్యాయి. దేశంలో 433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు మహారాష్ట్రకు చెందినవారున్నారు.
దేశంలో ఇప్పటి వరకు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించగా, మరో 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల లాక్ డౌన్ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడం చేయడంలో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆదివారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లాక్ డౌన్ని ప్రజలు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశం యావత్తు ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తిని మార్చి నెలాఖరు వరకు కొనసాగించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతేగాక, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని మోడీ కోరారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా సూచించారు. లాక్ డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తించాలని కోరారు.