వైద్యులతో జమాతే సభ్యుల అసభ్య ప్రవర్తన: యోగి సీరియస్, ఎన్ఎస్ఏ కింద కేసులకు ఆదేశం
లక్నో: వైద్యులు, పోలీసుల పట్ల తబ్లీఘీ జమాత్ కరోనా బాధితులు దాడులకు దిగుతూ అసభ్యంగా ప్రవర్తించడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా మానవత్వానికి శత్రువులంటూ మండిపడ్డారు. అంతేగాక, వీరిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
వైద్యులు ప్రజల ప్రాణాలు రక్షించడమే తమ కర్తవ్యంగా భయంకరమైన కరోనాతో పోరాడుతున్నారు. ఈ పోరాటానికి మనమంతా రుణపడి ఉండాలి. అలాంటి కనీస సంస్కారం లేకుండా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడటం, అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని సీఎం యోగి మండిపడ్డారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మూలకారణంగా భావిస్తున్న జమాత్ సభ్యులు ఘజియాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ కేంద్రంలో మహిళా నర్సుల ఎదుటే బట్టలు లేకుడా తిరుగుతూ, వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడులకు యత్నించారు.
ఈ విషయాన్ని సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఇలా ప్రవర్తించిన జమాత్ సభ్యులపై ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని సీఎం యోగి శుక్రవారం ఆదేశించారు. తబ్లిఘీ సభ్యులు ఉన్న వార్డుల్లో మహిళా నర్సులు, మహిళా పోలీసులను విధుల్లో ఉంచకూడదని స్పష్టం చేశారు. వైద్యులపై దాడులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2, 547కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 62 మంది మరణించారు. 2322 యాక్టిక్ కేసులున్నాయని తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 60వేలకు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షల దాటాయి.