కరోనాపై పోరుకు సీఎం సహాయనిధి నుంచి రూ.472 కోట్లు ఖర్చు చేసిన ఒడిషా ప్రభుత్వం
భువనేశ్వర్: మార్చి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒడిషా ప్రభుత్వం కోవిడ్-19 చికిత్స కోసం రూ.472.63 కోట్లు ఖర్చు చేసిందని ఆ రాష్ట్ర ప్రణాళిక శాఖా మంత్రి పద్మనాభ బెహరా అసెంబ్లీలో లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపులు కాకుండా ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఖర్చు వేరుగా ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే కోవిడ్-19 కోసం ఇప్పటి వరకు దాదాపుగా రూ.2వేల కోట్లు ఒడిషా ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం.
కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు బదిలీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఈ నిధులన్నీ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం, శ్రామిక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసేవారి టికెట్ చెల్లింపులకు, క్వారంటైన్లో ఉన్న వలసదారులకు ప్రోత్సాహకం చెల్లింపులు, నేపాల్లో చిక్కుకుపోయిన ఒడిషా రాష్ట్ర ప్రజలను తిరిగి రాష్ట్రానికి చేర్చేందుకు గాను అవసరమయ్యే రవాణా ఖర్చులకు ఉపయోగించడం జరిగింది. ఇక సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేసిన రూ.472 కోట్లలో క్వారంటైన్లో తప్పనిసరిగా ఉన్న వలసకూలీలకు ప్రోత్సాహకం కింద చెల్లించడం జరిగింది. అంతకుముందు ప్రోత్సాహకం కింద రూ.2వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Recommended Video
ఇదిలా ఉంటే రూ.160 కోట్లు పంచాయతీ రాజ్ అభివృద్ధి కోసం విడుదల చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలకు ప్రోత్సాహకం కింద పంచాయతీ రాజ్ ద్వారా డబ్బులు చెల్లించడం జరిగిందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 7 లక్షల మంది వలస కూలీలకు క్వారంటైన్లో ఉన్నందుకు గాను ప్రోత్సాహకం కింద రూ. 135 కోట్లు ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. ఇక పోలీస్ సిబ్బంది క్షేమం కోసం రూ.15 కోట్లు, మరో రూ.19 కోట్లు రోడ్డు పక్కన దుకాణాలు నడుపుకునేవారికి ఇవ్వడం జరిగిందని మంత్రి చెప్పారు. ఇక వలస కార్మికులను ఒడిషాకు రప్పించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్కు రూ.9 కోట్లు చెల్లించారని మంత్రి చెప్పారు. ఇక జంతువులను కాపాడేందుకు రూ. 1.34 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వెల్లడించారు.