ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టే
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి మరోసారి నిరాశ తప్పదని, ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోందని వెల్లడించాయి. 288 స్థానాల సంఖ్యాబలం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ముప్పావు భాగం సీట్లను బీజేపీ-శివసేన కూటమి కైవసం చేసుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ తేటతెల్లం చేశాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించిన దాదాపు అన్ని జాతీయ ఛానెళ్లు కూడా బీజేపీ-శివసేన కూటమే అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 141, శివసేన 102 స్థానాలను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోందని పేర్కొన్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 17 స్థానాలకే పరిమితమౌతుందని సీఎన్ఎన్ న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ ఛానెల్ తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది.
హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యం వహిస్తోన్న అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఒక స్థానాలో విజయం సాధిస్తుందని సీఎన్ఎన్ న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ అంచనా వేసింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24వ తేదీన వెల్లడి కానున్న విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ లోనూ దాదాపు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ-శివసేన కూటమి ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ భారీగా పెరుగుతాయని వెల్లడించింది. గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు భారీగా నష్టపోతాయని ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.