మరో 15 రోజులు ఉండి ఉంటే... ఆ అదృష్టానికి నోచుకోకుండానే... కంటతడి పెట్టించేలా కోపైలట్ విషాదం...
కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో ఒకరైన కోపైలట్ అఖిలేష్ కుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన భార్య గర్భంతో ఉన్నారు. ఈ ఏడాది మే నెలలో కోళీకోడ్ విమానాశ్రయంలో అందరిచేత అభినందనలు పొందిన అఖిలేష్ కుమార్... మూడు నెలలు తిరగకుండానే విషాదంగా మారిపోయారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్లో అఖిలేష్ భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో మే 8న అఖిలేష్ పైలట్గా వ్యవహరించిన విమానం కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు అందరిచేత అభినందనలు పొందారు.
ఆ ఇద్దరి వల్లే బయటపడ్డ 170 మంది...
అఖిలేష్తో పాటు విమాన ప్రమాదంలో మృతి చెందిన ఫ్లైట్ కమాండర్ కెప్టెన్ దీపక్ సాథే... రన్ వేపై విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి చాలానే ప్రయత్నించారు. విమానాశ్రయంపై రెండుసార్లు చక్కర్లు కొట్టిన తర్వాత.. విమానాన్ని రన్ వేపై ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు విమానం ప్రమాదానికి గురై రెండు ముక్కలైంది. ప్రమాదం నుంచి బయటపడ్డ చాలామంది... వాళ్లను యూనిఫాం ధరించిన హీరోలని పొగడుతున్నారు. దాదాపు 170 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారంటే అది వాళ్ల వల్లే అని చెప్తున్నారు.
మరికొద్ది రోజులు ఉండి ఉంటే...
ఉత్తరప్రదేశ్లోని మథురకి చెందిన అఖిలేష్కి మేఘతో 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన గర్భంతో ఉన్నారు. మరో 15-17 రోజుల్లో ఆమె ప్రసవించనునున్నారు. కన్నబిడ్డను కళ్లారా చూసుకునే అదృష్టం లేకుండానే అఖిలేష్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. మరికొద్ది రోజులు ఉండి ఉన్నా ఆయన తనకు పుట్టిన పాపనో,బాబునో చూసుకుని ఉండేవారు. కానీ విధి ఆయన్ను వెక్కిరించింది.అఖిలేష్కు ఇద్దరు తమ్ముళ్లు,ఒక సోదరి,తల్లిదండ్రులు ఉన్నారు. లాక్డౌన్కి ముందు ఒకసారి అఖిలేష్ మథురకి వచ్చి వెళ్లారు. 2017 నుంచి ఆయన ఎయిర్ ఇండియా సంస్థతో పనిచేస్తున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా మేలో ప్రారంభించిన కోళీకోడ్-దుబాయ్-కోళీకోడ్ ఎయిర్ ఇండియా విమానానికి ఆయనే మొదటి అధికారి.
అఖిలేష్తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్న పైలట్స్...
కమాండర్ కెప్టెన్ మైఖెల్ సల్దాన్హాతో కలిసి గతంలో కోపైలట్గా పనిచేశారు అఖిలేష్. తాజా ఘటన నేపథ్యంలో మైఖెల్ అఖిలేష్ గురించి గుర్తుచేసుకున్నారు.'విమానంలోనే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటికీ అతను జూనియర్,నాకు తెలిసి అది అతనికి రెండో మాన్సూన్ ఫ్లైట్. అయినప్పటికీ అతను విమానానికి సంబంధించి ఎప్పటికిప్పుడు అప్డేట్ నాలెడ్జితో ఉండేవాడు. ప్రస్తుత కోవిడ్ 19 ప్రోటోకాల్స్ నేపథ్యంలో ఇటీవల అఖిలేష్తో పెద్దగా మాట్లాడలేదు.' అని వెల్లడించారు.చాలామంది విమాన పైలట్లకు అఖిలేష్ పట్ల మంచి అభిప్రాయం ఉంది. నిజాయితీ పనిచేస్తాడని,టెక్నికల్ విషయాలను అర్థం చేసుకోవడంలో చాలావరకు సహాయం చేసేవాడని వాళ్లు గుర్తుచేసుకుంటున్నారు.
పెరిగిన మృతుల సంఖ్య..
ఇక ప్రమాద విషయానికొస్తే... ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. వీరిలో ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. విమాన ప్రమాదంలో మొత్తం 120 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రుల్లో 171 మంది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇందులో నలుగురు చిన్నారులు,ఒక గర్భిణీ సహా మరో 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.