వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన నిర్ణయం -Co-WIN రిజిస్ట్రేషన్ అవసరం లేదు -దగ్గర్లోని టీకా కేంద్రంలో నేరుగా..
సుప్రీంకోర్టు మొట్టికాయలో, రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లో, సామాన్యుల ఇక్కట్లో.. కారణం ఏదైనప్పటికీ, కొవిడ్ టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన విధానాలను సమూలంగా సవరించుకుంటున్నది. భారత్ లో కొవిడ్ టీకాల పంపిణీని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియగా చెప్పుకుంటోన్న మోదీ సర్కార్.. ఇప్పటి దాకా కోవిన్ పోర్టల్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి మాత్రమే టీకాలు ఇస్తూరాగా, ఇప్పుడా విధానంలో మార్పులు చేసింది. ఇకపై..
18 ఏళ్లు నిండినవారంతా ఇకపై ఎలాంటి ముందస్తు నమోదు ప్రక్రియ లేకుండా, అంటే కొవిన్ పోర్టల్ లో పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమకు దగ్గర్లోని టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్లు పొందొచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పూర్తి డిజిటల్ విధానంలో కోవిన్ పోర్టల్ ద్వారా మాత్రమే టీకాలు ఇస్తుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, నిరక్ష్యరాస్యులకు ఈ విధానం కష్టతరంగా మారిన నేపథ్యం, కేవలం డిజిటల్ విధానంలో మాత్రమే టీకాల పంపిణీని సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిన దరిమిలా కేంద్రం ఈ తాజా నిర్ణయానికి వచ్చింది.
ఆయా ఊళ్లలో పరిస్థితులు, అవకాశాలను బట్టి కొన్ని ప్రాంతాలలో ఆశ వర్కర్స్ లేదా హెల్త్ వర్కర్స్ ప్రజల దగ్గరికే వెళ్లి మరీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వాక్సినేషన్ రిజిస్టర్ కోసం 1075 డైల్ చేసి కూడా వాక్సిన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఏ విధాలుగా అయినా సరే వ్యాక్సిన్ వేయించుకోవడానికి సులువుగా ఉంటాయని ఇబ్బంది లేకుండా రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా వ్యాక్సిన్ వేయించుకో వచ్చు అని చెప్పింది. రిజిష్ట్రేషన్ తొలగింపునకు వ్యాక్సినేషన్ పై అపోహలను పోగొట్టాలనే ఉద్దేశం కూడా ఒకటని కేంద్రం పేర్కొంది.
జూన్ 13 నాటికి, కోవిన్లో నమోదైన 28.36 కోట్ల మంది లబ్ధిదారుల లో, 16.45 కోట్ల (58%) లబ్ధిదారులు ఆన్-సైట్ మోడ్ లో నమోదు చేసుకోగా, జూన్ 13, 2021 నాటికి కోవిన్ లో నమోదైన మొత్తం 24.84 కోట్ల వ్యాక్సిన్ మోతాదులలో, 19.84 కోట్ల మోతాదులు (మొత్తం టీకా మోతాదులలో దాదాపు 80%) ఆన్సైట్ / వాక్-ఇన్ టీకా ద్వారా తీసుకున్నారు.
దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జాతికి హామీ ఇవ్వడం తెలిసిందే. మోదీ చెప్పినట్లు యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకునేలా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. జులై, ఆగస్టు నాటికి దేశ అవసరాల్లో కనీసం 50 శాతం టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా.