ఆధార్ కార్డులతో మొబైల్ సిమ్ లింక్: మరింత సమయం కోరిన టెలికం ఆపరేటర్లు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులతో మొబైల్ సిమ్ కార్డుల అనుసంధానం కోసం ఓటీపీ తరహాలో ఆధార్ ఆధారిత కొత్త విధానం అమల్లోకి రావాలంటే ఇంకాస్త సమయం అవసరమని సెల్యూలార్ ఆపరేటర్స్ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు మరింత సమయాన్ని ఇవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కోరింది.
సిమ్కార్డులను ఆధార్తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేసింది కేంద్రప్రభుత్వం. 2018 ఫిబ్రవరి మాసాంతానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
అయితే ఆయా టెలికం ఆపరేటర్ల వద్ద ఆధార్తో అనుసంధానం చేసుకొనే ప్రక్రియను ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఓటిపి ఆధారంగా కూడ ఆధార్ అనుసంధానం చేసుకొనే ప్రక్రియ ప్రారంభం కానుంది.
సిమ్ల రీ వెరిఫికేషన్కు సిద్దంగా లేమన్న టెలికం ఆపరేటర్లు
సిమ్ల రీ వెరిఫికేషన్కు ప్రస్తుతం డిసెంబర్ 1 తుది గడువుగా ఉంది. తాము ఇంకా సిద్ధంగా లేమని కాయ్ తెలిపింది. ఏఐడీఏఐ ప్రతిపాదిత విధానం అమలుకు ఇచ్చిన గడువు ఆచరణీయంగా లేదని టెలికాం శాఖ, యూఐడీఏఐకి సూచించినట్టు కాయ్ డీజీ రాజన్ మాథ్యూస్ మీడియాకు వెల్లడించారు.వన్ టైం పాస్వర్డులు, ఎస్ఎంఎస్ ఆధారిత కొత్త విధానం త్వరగా తీసుకురావాలని యూఐడీఏఐ సెల్యూలార్ ఆపరేటర్లను ఆదేశించింది.
4 నుండి 6 వారాల సమయం
కస్టమర్ అక్విజిషన్ ఫామ్ (సీఏఎఫ్)లో మార్పులు అవసరమని, కొన్ని అంశాలను నిర్ణయించేందుకు కనీసం 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు.. ఏ సాంకేతిక ప్రక్రియకైనా సమయం అవసరమౌతోందని చెప్పారు.
సిఏఎఫ్ జారీ చేయనున్న టెలికం శాఖ
మార్పులు చేసిన సీఏఎఫ్ను టెలికాం శాఖ జారీ చేస్తుంది. దాన్నే దేశవ్యాప్తంగా ఆపరేటర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటికే వినియోగిస్తున్న సిమ్లను పునఃతనిఖీ చేసేందుకు ఓటీపీ ద్వారా ఆధార్ ఆధారిత తనిఖీ విధానాన్ని సరళీకరించాలని ప్రభుత్వం గత నెల్లో ప్రకటించింది. ఇప్పటికే స్టోర్లలో జరుగుతున్న ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.
ఆధార్ అనుసంధానానికి కొత్త పద్దతులు
మొబైల్ నెంబర్లను ఆధార్తో లింక్ చేసుకునే ప్రక్రియకు మూడు కొత్త విధానాలను గత నెలలోనే ప్రభుత్వం ఆమోదించింది. అందులో ఓటీపీ కూడా ఒకటి. మరో రెండు యాప్ లేదా ఐవీఆర్ఎస్ సౌకర్యం. ఈ మూడు ప్రక్రియల ద్వారా ఆధార్తో మొబైల్ నెంబర్లను లింక్ చేసుకునే ప్రక్రియ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండనుంది.