జిందాల్ కు మాత్రం ఒక న్యాయమా?: సీబీఐకి కోర్టు మొట్టికాయ
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై కేసు విచారణ చేస్తున్న స్పెషల్ కోర్టు మండిపడింది. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో మీకు అందరూ సమానమే, ఒక్కోక్కరిని ఒక్కోక్క విధంగా చూడరాదని సీబీఐ అధికారులకు కోర్టు సూచించింది.
బొగ్గు కుంభకోణం కేసులో నవీన్ జిందాల్ ఆరోపణలు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. గురువారం కేసు విచారణ జరిగింది. ఈ సందర్బంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నవీన్ జిందాల్ పాస్ పోర్టును మీరు సీజ్ చేశారా అని ప్రత్యేక కోర్టు సీబీఐ అధికారులను ప్రశ్నించింది.
కేసు విచారణ జరుగుతున్న సందర్బంగా నవీన్ జిందాల్ పాస్ పోర్టు సీజ్ చెయ్యరాదని తాము అనుకున్నామని సీబీఐ కోర్టు ముందు చెప్పింది. ఆ సమయంలో న్యాయమూర్తి మండిపడ్డారు. పాస్ పోర్టులు స్వాధీనం చేసుకునే విషయంలో, సీజ్ చేసే విషయంలో ఒక్కోక్కరికి ఒక్కో విధానం అనుసరించరాదని సూచించారు.
ఇలాంటి కుంభకోణాల కేసులలో అందరికి ఒకే సూత్రం వర్తించేలా ఒకే విధానాన్ని రూపొందిచాలని న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్ కు సూచించింది. బొగ్గు కుంభకోణంపై మే 6వ తేదిన వాదనలు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అదే రోజు అభియోగపత్రాలు పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. చార్జీషీట్ లో దాఖలైన 14 మంది వాదనలు కోర్టు ముందు వినిపించనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, మాజీ ఎంపీ నవీన్ జిందాల్, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా తదితరులు బొగ్గు కుంభకోణం స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.