మధుకోడాపై అభియోగాలు నమోదు చెయ్యాలి
న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా మీద అభియోగాలు నమోదు చేయ్యాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధుకోడాతో సహా మరో ఎనిమిది మందిపై కూడా అభియోగాలు నమోదు చెయ్యాలని కోర్టు సూచించింది.
బొగ్గు స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న మధుకోడా మీద జులై 31వ తేది లోపు అభియోగాలు నమోదు చెయ్యడానికి అవకాశం ఇస్తున్నామని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ స్పష్టం చేశారు. జులై 31 లోపు అందరి మీద అభియోగాలు నమోదు చేసి కోర్టులో సమర్పించడానికి సీబీఐ అధికారులు సిద్దం అయ్యారు.
బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సీ. గుప్తా, జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే. బసు పేర్లు అందులో చేర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా బసంత్ కుమార్ బట్టాచార్య, బిపిన్ బిహారి సింగ్, వాణి ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ డైరెక్టర్ వైభవ్ తుష్యాన్, విజయ్ జోషి, నవీన్ కుమార్ తుష్యాన్ పేర్లు చేర్చాలని న్యాయమూర్తి సూచించారు.
వీరి మీద ఐపీఎస్ సెక్షన్ 120 బీ, సెక్షన్ 420, 409 సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. వీరి మీద విచారణ జరిపి అభియోగాలు నమోదు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో సమర్పించవలసి ఉంటుంది. బొగ్గు స్కాం కేసులో ఇప్పటికే పలువురి మీద కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.