నవీన్ జిందాల్ కు ఊరట: విదేశీ పర్యటనకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. 15 రోజులు విదేశాలకు వెళ్లడానికి ప్రత్యక న్యాయస్థానం నవీన్ జిందాల్ కు అనుమతి ఇచ్చింది.
బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ తదితరుల మీద సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో పలు కంపెనీలు, పెట్టుబడి సంస్థలు ఉన్నాయి. మాజీ ప్రధాని మన్మోన్ సింగ్ సైతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయితే దాసరి నారాయణరావు, నవీన్ జిందాల్, మధు కోడాలకు ప్రత్యక న్యాయస్థానం షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది.
దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.వ్యాపారనిమిత్తం తాను విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని నవీన్ జిందాల్ కోర్టు లో అర్జీ సమర్పించారు. అర్జీ విచారించిన న్యాయస్థానం జూన్ 14 నుంచి 29వ తేది వరకు నవీన్ జిందాల్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.