కోల్ స్కాం కేసు: సిబిఐ కోర్టులో మన్మోహన్కు ఊరట
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సిబిఐ కోర్టులో ఊరట లభించింది. ఆయనను అదనపు నిందితుడిగా పేర్కొంటూ సమన్లు జారీ చేయాలని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా చేసిన విజ్ఞప్తిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది.
‘మధుకోడా చేసుకున్న పిటిషన్ను కొట్టివేశాం'అని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ పరాషార్ స్పష్టం చేశారు. నవీన్ జిందాల్ గ్రూప్కు బొగ్గుబ్లాకుల కేటాయింపునకు సంబంధించి ఆ శాఖను పర్యవేక్షించిన అప్పటి ప్రధాని మన్మోహన్ను ప్రశ్నించాలని మధుకోడా కోరారు. సెప్టెంబర్ 28న దీన్ని విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది.
మధుకోడా ఆరోపణల్లో వాస్తవం లేదని, కోల్గేట్కు సంబంధించిన రికార్డుల్లోనూ మన్మోహన్ పాత్ర ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. మాజీ ప్రధానితోపాటు మరో ఇద్దరిని విచారించాలని జార్ఖండ్ మాజీ సిఎం కోర్టును అభ్యర్థించారు. బొగ్గుశాఖను చూసిన మన్మోహన్సింగ్కు తెలియకుండా కేటాయింపులు జరగలేదని కోడా ఆరోపించారు.
ఈమొత్తం వ్యవహారం మన్మోహన్కు తెలిసే జరిగిందని మాజీ తరపున్యాయవాది వాదించారు. అప్పట్లో బొగ్గుశాఖ మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావుకుంభకోణంలో నిందితుడిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అమర్కొండా ముర్గాదంగల్ బొగ్గుబ్లాకుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
జిందాల్ గ్రూపునకు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జెఎస్పిఎల్), గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్(జిఎస్ఐపిఎల్)కు బ్లాకుల కేటాయించారు. ఈ కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సహా ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, గనులు, జియోలజీ శాఖ కార్యదర్శి శంకర్ తివారీల పాత్ర వుందని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు.