బొగ్గు కుంభకోణం కేసు: మధు కోడాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బొగ్గు కుంభకోణంలో కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు జనవరి 22 వరకు నిలుపుదల చేసింది. దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో తదుపరి విచారణ వరకు బెయిల్ మంజూరు చేసింది.
అంతేగాక, అతనిపై విధించిన రూ. 25 లక్షల జరిమానాపై కూడా స్టే విధిస్తూ జస్టిస్ అను మల్హోత్రా తీర్పు వెలువరించారు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ మధుకోడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సీబీఐ వివరణ కోరుతూ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.
జార్ఖండ్లోని బొగ్గు గనులను కోల్కతాలోని విని ఐరన్ ఆండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలతో గతంలో ముధుకోడాతో పాటు జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, జోషీలకు ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి దాఖలైన విషయాలన్నింటినీ జనవరి 22న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.