రూ. వేల కోట్ల బొగ్గు స్కాం కేసు: మాజీ సీఎం దోషి: సీబీఐ కోర్టు, రేపు శిక్ష ఖరారు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. వేల కోట్ల బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొగ్గు గనుల స్కాం కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా, ఆ రాష్ట్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ. గుప్తాతో సహా మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది.
బొగ్గు గనుల అక్రమ కేటాయింపు కేసులో మాజీ సీఎం మధు కొడా అవినీతికి పాల్పడినట్లు రుజువైందని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మరో నలుగురిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. మాజీ సీఎం మధు కోడాతో సహ నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం వీరికి శిక్ష ఖరారు చేయనుంది.
2007లో ఝార్ఖండ్ లోని రాజ్ హరా పట్టణం సమీపంలో గల కోల్ కతాకు చెందిన విని ఐరన్ అండ్ ఫీల్డ్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అక్రమంగా బొగ్గు గనులు కేటాయించారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడా తదితరుల మీద ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.
బొగ్గు గనుల కేటాయింపులో అప్పటి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకొడా, మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు విని ఐరన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
బొగ్గు గనుల కేటాయింపు విషయంలో పారదర్శకంగా వేలం నిర్వహించలేదని, దీనివల్ల ప్రభుత్వానికి రూ. కొన్ని వేల కోట్లు నష్టం వచ్చిందని, అక్రమాలు జరిగాయని సీబీఐ పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు మధుకొడా సహా మొత్తం ఏడుగురిని దోషులుగా తేలుస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. గురువారం ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాతో సహ అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో అంటూ దేశం మొత్తం ఎదురు చూస్తోంది.