మన్మోహన్కి సమన్లు ఇవ్వండి: కోర్టుకు మధుకోడా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సంచలన డిమాండ్ చేశారు. కేసు విచారణలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ను పిలిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖను నాటి ప్రధాని మన్మోహన్ నిర్వహించారని కోడా గుర్తు చేశారు. ప్రధానికి తెలియకుండా ఏదీ జరగదని చెప్పారు. తద్వారా మన్మోహన్కు అంతా తెలుసని పరోక్షంగా చెప్పినట్లైంది. దీంతో మధుకోడా వినతిపై సమాధానం ఇవ్వాలని ప్రత్యేక కోర్టు సిబిఐని కోరింది.
సాక్ష్యాలు తారుమారు చేశారంటూ.. గోవా మాజీ సీఎం కామత్ పై కేసు
పనాజి: లూయిస్ బర్గర్ లంచాల కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్పై కేసు నమోదైంది. ఈ కేసులో కీలకమైన ఫైళ్లను వెతుకుతున్న గోవా క్రైమ్ బ్రాంచ్ ఈ కేసు పెట్టగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలు మాయం చేయడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆయనపై ఇప్పటికే ఐపిసి సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 8, 9, 13ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జికా) నిధులతో తలపెట్టిన నీటి నిర్వహణ ప్రాజెక్టును పొందేందుకు యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న లూయిస్ బర్గర్ సంస్థ గోవా ప్రభుత్వంలోని వారికి లంచాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.