కోడిపుంజుపై కేసు పెట్టండి..! తలలు పట్టుకున్న పోలీసులు..!
శివపురి : మర్డర్లు, దొంగతనాలు, నేరాలు ఇతరత్రా కేసులతో నిత్యం సతమతమయ్యే పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. సహజంగా కేసులంటే మనుషులపై పెడతారు. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటన అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది. కోడిపుంజుపై కేసు పెట్టాలంటూ ఠాణా మెట్లెక్కింది ఓ మహిళ. దీంతో కేసు ఎలా పెట్టాలో, ఆమెకు ఎలా సర్ధిచెప్పాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు పోలీసులు.
పుంజు కేసు..!
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో జరిగిన కోడిపుంజు కేసు చదవడానికి నవ్వులా అనిపించినా.. అక్కడి పోలీసులకు మాత్రం చుక్కలు చూపించింది. పక్కింటివారు పెంచుకుంటున్న కోడిపుంజుపై కోపం పెంచుకున్న ఓ మహిళ పోలీస్ స్టేషన్ గడపతొక్కింది. ఆ సమయంలో ఇతరత్రా కేసులతో సతమతమవుతున్న పోలీసులకు.. ఆమె కోడిపుంజుపై ఫిర్యాదు చేయడం వింతలా అనిపించింది. మొదట వాళ్లు కూడా నవ్వుకున్నా.. ఆమెకు సర్ధిచెప్పలేక, అటు కేసు బుక్ చేయలేక ఇబ్బందులు పడ్డారు.
కేసు ఎందుకంటే..!
ఇంతకు సదరు మహిళ కోడిపుంజుపై చేసిన ఫిర్యాదు ఏంటంటే.. పక్కింటి కోడిపుంజు ప్రతిరోజు మా ఇంటికి వస్తోంది, మా కూతురును పొడుస్తోంది. దాని యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కు రావాల్సి వచ్చింది. ఇది ఆమె వేదన. కోడిపుంజుతో పాటు దాని యజమానులైన పక్కింటి దంపతులపై కూడా కేసు పెట్టాలని పోలీసులతో వాదించింది.
జైలుకు వెళ్లినా సరే.. పుంజును వదలం..!
సదరు మహిళ ఫిర్యాదు మేరకు కోడిపుంజుతో పాటు ఆ దంపతులను స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. అయితే కోడిపుంజుపై కేసు పెట్టాలనుకున్న మహిళ వెర్షన్ అలా ఉంటే.. దాన్ని పెంచుకుంటున్న దంపతుల వాదన మరింత విచిత్రంగా ఉంది. పిల్లలు పుట్టకపోతే దాన్ని పెంచుకుంటున్నామని.. అది మాకు బిడ్డతో సమానమని చెప్పుకొచ్చారు. కోడిపుంజుపై తమకు అపారమైన ప్రేమ ఉందని, తాము జైలుకు వెళ్లినా సరే దాన్ని మాత్రం వదులుకోమని స్పష్టం చేశారు. కేసు గిసు అంటే తమపై పెట్టుకోవాలని.. కోడిపుంజుకు ఏం జరిగినా తాము ఊరుకోబోమని సంకేతాలిచ్చారు. దీంతో అక్కడి పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇరువురు చెప్పింది విన్న తర్వాత ఎవరిని ఏమనాలో తెలియక తలలు పట్టుకున్నారు. చివరకు కింద మీద పడి కోడిపుంజుపై కేసు పెట్టేందుకు వచ్చిన సదరు మహిళకు సర్ధిచెప్పి ఇంటికి పంపించి ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.