కాగ్నిజెంట్ సంస్థలో మార్పులు: ఈవీపీ దేబాశిష్పై వేటు..మరో 150 మంది ఉద్యోగులకు గుడ్బై
బెంగళూరు: ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ హైలెవెల్ మేనేజ్మెంట్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. 23 ఏళ్లు అదే కాగ్నిజెంట్ సంస్థలో పనిచేసిన ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేబాశిష్ ఛటర్జీ కంపెనీని వీడనున్నారు. కాగ్నిజెంట్లో తన 23 ఏళ్ల సమయంలో ఛటర్జీ పలు పదవులను నిర్వర్తించారు. ఇందులో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు గ్లోబల్ హెడ్గా కూడా సేవలందించారు. కాగ్నిజెంట్ బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ సర్వీసెస్ను వృద్ధిలోకి తీసుకురావడంతో ఛటర్జీ కీలక పాత్ర పోషించారు. ఇక్కడి నుంచే సంస్థకు 35 శాతం రెవిన్యూ వస్తుంది. 2007 వరకు ఈ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు.
ఇక జూనియర్ లెవెల్లో కూడా కంపెనీ పలువురు ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది. వేతనాల పెంపు సమయంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 150 మందిని కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది. అయితే 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో సంస్థ ఉన్నట్లు సమచారం. అయితే తమకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించని వారిని, ఆ ఉద్యోగులకు వచ్చిన రేటింగ్ ఆధారంగా కంపెనీ యాజమాన్యం సాగనంపేందుకు నిర్ణయించింది.
ఇదిలా ఉంటే ఉద్యోగుల ఉద్వాసనపై యాజమాన్యాన్ని మీడియా సంప్రదించగా... పుకార్లపై తాము సమాధానం చెప్పదలుచుకోలేదని తెలిపింది.కొత్త సీఈఓ నియామకం జరగగానే కంపెనీలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని మాత్రమే యాజమాన్యం వెల్లడించింది. ఖర్చుల వివరాలు తగ్గించుకునేందుకు తప్పనిసరిగా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడినట్లు సంస్థ సీఈఓ బ్రెయిన్ హంప్షైర్ తెలిపారు. ఏప్రిల్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టిన హంప్షైర్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే టాప్ లెవెల్ నుంచి జూనియర్ లెవెల్ వరకు ఉన్న ఉద్యోగుల విషయంలో సీరియస్గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే కాగ్నిజెంట్ సంస్థలో పలు కీలక మార్పులు జరిగాయి. కంపెనీకి ప్రధాన వ్యూహకర్తగా ఉన్న మాల్కం ఫ్రాంక్ను తొలగించిన హంప్షైర్... ఆస్థానంలో 16 ఏళ్ల అనుభవం ఉన్న గజేన్ కండయను నియమించారు. డిజిటల్ బిజినెస్కు ఆయన్ను ప్రెసిడెంట్ చేశారు. కాగ్నిజెంట్ గ్లోబల్ ఇండస్ట్రీస్ మరియు కన్సల్టింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్గా ఉన్న ప్రసాద్ చింతమనేనికి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ బిజినెస్కు మధ్యంతరంగా అదనపు బాధ్యతలు అప్పగించారు.