చెన్నైకి 260కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కాగ్నిజెంట్
చెన్నై: చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థ భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అమెరికా ప్రధానకేంద్రంగా ఉన్న ఈ సంస్థ వరద బాధితుల సహాయార్థం 40 మిలియున్ డాలర్ల(దాదాపు రూ. 260కోట్లు) ఆర్థికసాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.
సంస్థ చెన్నై కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తంలో 10 మిలియన్ డాలర్లను( దాదాపు రూ. 65కోట్లు) సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో 30 మిలియన్ డాలర్లను(దాదాపు 195కోట్లు) వరద బాధితులకు సాయం చేసే ఎన్జీవోలు, ఛారిటీలకు అందించనున్నట్లు వెల్లడించింది.
కాగ్నిజెంట్ ఫౌండేషన్ ద్వారా కూడా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. భారత్లోని అన్ని నగరాలతో పోలిస్తే.. చెన్నై కాగ్నిజెంట్లోనే అత్యధిక ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 60వేల మంది ఇందులో పనిచేస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దాదాపు 300మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, సంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సాయం ప్రకటించారు.