కాగ్నిజెంట్ రిపోర్ట్ షాక్: భారతీయ ఉద్యోగుల భారీ కోత
ఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్లో గత సంవత్సరం భారీగా ఉద్యోగాల కోత విధించినట్లు ఆ కంపెనీ వార్షిక ఫైలింగ్ ద్వారా యూఎస్ సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు భారత్లోనే అత్యధికంగా జరగడం గమనార్హం.
భారత్ వాటా అధికమే
ఈ నివేదిక ప్రకారం అమెరికా, యూరప్లోని కాగ్నిజెంట్లో ఉద్యోగాల సంఖ్య కొద్దిగా పెరిగినప్పటికీ.. భారత్లో మాత్రం ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా ఉంది. 2017 నివేదిక ప్రకారం మొత్తం కాగ్నిజెంట్లో 2.60లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో భారత్లో సుమారు 1.8లక్షల మంది ఉన్నారు.
తొలగింపు భారీగానే..
కానీ అంతక్రితం ఏడాది 2016లో కంపెనీలో 2,60,200 మంది పనిచేస్తుండగా.. వారిలో భారత్లో పనిచేస్తున్న వారి సంఖ్య 1.88లక్షలుగా ఉంది. అంటే దీని ప్రకారం గతేడాది కాగ్నిజెంట్ దాదాపు 8వేల మంది ఉద్యోగులను తొలగించింది.
అదే కారణం
భారత ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు ఆటోమేషనే కారణమని తెలుస్తోంది. దీంతో పాటు సరికొత్త నైపుణ్యాలు, ఆలోచనలు కలిగిన వారికే ఐటీ కంపెనీలు ఎక్కువగా అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపుతుండటం ఇతర కారణాలుగా తెలుస్తున్నాయి.
ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశం
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం నాటికి ఐటీ రంగంలో అదనంగా మరో 10లక్షల మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, ఐటీ రంగంలో వృత్తి నైపుణ్యం కలవారికే ఈ అవకాశాలని తెలుస్తోంది.