ప్రధానిని చంపుతామంటూ ఫోన్ సంభాషణ, కోయంబత్తూరు పేలుళ్ల కేసు నేరస్తుడి అరెస్ట్
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీని లేపేస్తామంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఆ ఆఢియో క్లిప్ ఆధారంగా కోయంబత్తూరు వరుస పేలుళ్ళ కేసులో శిక్ష అనుభవించిన మహ్మద్ రఫీక్ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇరవై ఏళ్ల క్రితం నాటి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చాడు.
కోయంబత్తూరులో 1998లో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 58 మంది మృతి చెందారు. ఈ పేలుళ్ల కేసులో మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతను జైలు శిక్ష కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కునియాముత్తూరు ప్రాంతంలో నివసిస్తూ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా ఉన్నాడు.
ఇదిలా ఉండగా, ఇటీవల రఫీక్ మరో వ్యక్తితో ఎనిమిది నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఈ సంభాషణల్లో ప్రధాని మోడీని చంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రఫీక్ మరో వ్యక్తితో అంటున్నట్లుగా ఉంది.
మొదట వారి సంభాషణ ట్రాన్సుపోర్ట్ వాహనాల గురించి జరిగిందని, ఆ తర్వాత మోడీని చంపాలని అనుకుంటున్నామని అన్నట్లుగా ఉందని, 1998లో అద్వానీ పర్యటించిన సమయంలో కూడా మనమే బాంబులు పెట్టామని పేర్కొన్నట్లుగా ఆ సంభాషణ ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుడు రఫీక్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీనిపై ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.