4రాష్ట్రాల ఆపరేషన్: భార్యతోపాటు మావో అగ్రనేత అరెస్ట్
చెన్నై: తమిళనాడులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కేరళ మావోయిస్టు అగ్రనేత రూపేష్ అలియాస్ ప్రవీణ్, అతని భార్య షైనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ మాజీ స్పీకర్ శ్రీపతిరావు హత్య కేసులో నిందితుడైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజరెడ్డికి వీరే ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు తమిళనాడుకు చెందిన కణ్ణన్, కేరళకు చెందిన అనూప్, కర్నాటకకు చెందిన వీరమణిలను అరెస్ట్ చేశారు.
వీరంతా కోయంబత్తూరుకు సమీపంలోని ఓ బేకరీలో కాఫీ తాగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రూపేష్, షైనా దంపతులు గత పది సంవత్సరాలుగా పోలీసుల కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు నాలుగు రాష్ర్టాల పోలీసులు ఉమ్మడిగా ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టులను అరెస్టు చేయగలిగారు. రూపేష్ న్యాయశాస్త్రంతోపాటు ఐటీ చదివాడని ఇతనిపై 20 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.
పోలీసులు రూపేష్ను అరెస్టు చేయడం గొప్ప విజయమని, నాలుగు రాష్ర్టాల పోలీసుల ఉమ్మడి కృషి ఫలితమని కేరళ హోంశాఖ మంత్రి రమేష్ చెన్నితాల వ్యాఖ్యానించారు. రూపేష్ గత కొద్ది సంవత్సరాలుగా కేరళలో మావోయిస్టు సౌత్ ఇండియన్ రీజియనల్ కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని కేరళ ఇంటెలిజెన్స్ శాఖ తెలిపింది.
రూపేష్ దంపతులు వ్యూహాత్మక సాయుధ పోరాటం చేయడంలో నిపుణులని వెల్లడించింది. రూపేష్ మొదట విద్యార్థిగా సిపిఐ(ఎంఎల్) కార్యకలాపాల్లో పాల్గొని తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీలో చేరాడని తెలిపారు. కేరళలోని తిరిస్సుర్ జిల్లాకు చెందిన రూపేష్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అతని భార్య షైనా నేతృత్వంలో మహిళా మావోయిస్టుల కోసం కొత్తగా భవాని దళం ప్రారంభించినట్లు తెలుస్తోంది. రూపేష్ నుంచి మరింత కీలకమైన సమాచారం లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రూపేష్, అతని భార్య షైనా తోపాటు మరో ముగ్గురిని పోలీసులు మరింత లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.