సాహో ‘ఆర్మీ సింగం’ కల్నల్ అశుతోష్ శర్మ.. ప్రజల్ని కాపాడబోయి వీరమరణం.. ఐదేళ్లలో తొలిసారి ఇలా..
కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ సిబ్బందికి గౌరవసూచకంగా ఇండియన్ ఆర్మీ ఇవాళ దేశమంతటా ఆయా ఆస్పత్రులపై పూలవర్షాన్ని కురిపించింది. ఆ ఆనందాన్ని అనుభవించేలోపే ఆర్మీకి సంబంధించి మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే కుప్వారా జిల్లాలో జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైపోగా, మనవైపు ఐదుగురు వీరులు అమరులయ్యారు. అందులో కల్నల్ అశుతోష్ శర్మ కూడా ఉన్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. పైగా..
చాలా కాలంగా జమ్మూకాశ్మీర్ లో పనిచేస్తోన్న కల్నల్ అశుతోష్ శర్మ.. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు పెట్టిది పేరు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లన్నీ దాదాపు సక్సెస్ అయ్యాయి. టెర్రరిస్టుల బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సింహంలా దూసుకుపోయే ఆయనకు 'ఆర్మీ సింగం'లాంటి ఇమేజ్ ఉంది. గాడ్స్ రెజిమెంట్ కు చెందిన అశుతోష్ అసమాన ధైర్యసాహసాలకు గుర్తింపుగా గతంలో ఆయనకు రెండు సార్లు ప్రతిష్టాత్మక గాలంట్రీ(సాహస) అవార్డులు దక్కాయి. ఆదివారం నాటి సంఘటనలోనూ ప్రజల్ని కాపాడేందుకే ఆయన తన ప్రాణాల్ని అడ్డువేశారు.
Recommended Video
కుప్వారా జిల్లాలోని హంద్వారా అనే చిన్న పట్టణానికి సీపంగా చాంద్ముల్లా అనే ఊరుంది. అక్కడ టెర్రరిస్టులు దాక్కున్నారనే సమాచారంతో ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసుల బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. దానికి కల్నల్ అశుతోష్ శర్మ నాయకత్వం వహించారు. బలగాల రాకను ముందే పసిగట్టిన టెర్రరిస్టులు.. సాధారణ పౌరుల్ని బందీలుగా చేసుకుని వాళ్లను 'హ్యూమన్ షీల్డ్స్' వాడుకుంటూ కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల్ని చంపడం కంటే, అమాయకుల ప్రాణాల్ని కాపాడటానికే ప్రాధాన్యం ఇవ్వాలని కల్నల్ ఆదేశించారు. దీంతో మనవాళ్లు ఆచితూచి కాల్పులు జరపాల్సివచ్చింది..
కొన్ని గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో చివరికి ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. అమాయక ప్రజల ప్రాణాలనైతే కాపాడగలిగారు కానీ ఆ ఘటనలో కల్నల్ అశుతోష్ తోపాటు ఆర్మీ మేజర్ అనూజ్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్తోపాటు జమ్మూకాశ్మీర్ పోలీస్ ఎస్ఐ షకీల్ ఖ్వాజీ వీరమరణం పొందారు. ఒక కల్నల్ స్థాయి అధికారి.. టెర్రరిస్టుల తూటాలకు బలైపోవడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2015 జనవరిలో ఇదే జమ్మూ కాశ్మీర్ లో కల్నల్ ఎంఎన్ రాయ్ వీరమరణం పొందారు. అదే ఏడాది నవంబర్ లో మరో కల్నల్ సంతోష్ మహాదిక్ అమరుడయ్యారు.