విద్యార్థినిపై టిఎంసి స్టూడెంట్ వింగ్ నేత దాడి, విచారణ
Recommended Video
కోల్కతా:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నేత షాహిద్ హసన్ఖాన్ అదే సంఘంలో పనిచేస్తున్న విద్యార్థి నాయకురాలిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవి పుటేజీ బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హూగ్లీ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి ప్రధాన కార్యదర్శిగా షాహిద్ హసన్ ఖాన్ పనిచేస్తున్నాడు. తృణమూల్ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న విద్యార్థి నాయకురాలిపై హసన్ ఖాన్ దాడి చేశాడు. బాధిత విద్యార్థిని రిష్రా కాలేజీలో కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. హసన్ కూడ అదే కాలేజీలో చదువుతున్నారు.
అయితే పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడుతూ షాహిద్ అవినీతికి పాల్పడుతున్న విషయమై బాధిత విద్యార్థిని హసన్ను ప్రశ్నించింది. దీంతో ఆమెను యూనియన్ కార్యాలయానికి రప్పించుకుని మరీ షాహిద్ దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. తోటి సభ్యులు ప్రయత్నించినా వారిని తోసేస్తూ ఆమెపై దాడి చేశాడు. డిసెంబర్ 4న ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మాత్రం ప్రస్తుతం వెలుగు చూశాయి.
షాహిద్ తనను ఇష్టమొచ్చినట్టు కొట్టాడని బాధితురాలు చెప్పారు. చాలా కాలంగా తనపై దాడి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. లైంగికంగా కూడా నన్ను వేధించేవాడని బాధితురాలు చెప్పారు.
తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదరిస్తున్నాడని ఆమె చెప్పారు. హసన్ తండ్రి జహీద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కావటంతో అతని ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నాయని చెప్పారు..
సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి రావటంతో స్పందించిన రిష్రా కాలేజీ యాజమాన్యం హసన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అతన్ని జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయ దత్తా తెలిపాడు. విద్యాశాఖా మంత్రి పార్థ ఛటర్జీ ఘటనపై అధికారులను సమగ్ర నివేదికను కోరారు. అయితే తనకేం తెలీదని.. ఆ అమ్మాయి తాను మంచి స్నేహితులమని.. పైగా తోటి సభ్యురాలిపై దాడి చేయాల్సిన అవసరం తనకేంటని హసన్ బుకాయిస్తున్నాడు.