నడిరోడ్డుపై కీచక పర్వం, విద్యార్థినిని చుట్టుముట్టి.. వేధిస్తూ.. వీడియో తీసి...
భువనేశ్వర్ : కొంతమంది కీచకులు నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ కాలేజీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశారు. అంతే కాదు, సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఆ పనికిమాలిన చర్యను వీడియో కూడా తీశారు.
ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగిన అక్టోబర్ 4వ తేదీన జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా డిసెంబర్ 3న వెలుగులోనికి వచ్చింది. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో సుమారు 10 మందికిపైగా యువకులు కీచక పర్వానికి పాల్పడ్డారు.
కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న ఆ విద్యార్థినిని యువకులు గుంపుగా చుట్టుముట్టారు. ఆమెను కామెంట్ చేస్తూ.. వేధింపులకు గురిచేశారు. దుస్తులు లాగడానికి యత్నించారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
ఆ విద్యార్థినితోపాటు ఉన్న యువకుడిని చితకబాదారు. తమను వదిలేయమంటూ ఆమె ప్రాధేయపడినా ఆ కీచక యువకులు కనికరించలేదు, వినిపించుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో పోలీసులు స్పందించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనే ఆ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిగిరిలో కూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించగా, బాధిత యువతిని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కూడా సందర్శించి ఓదార్చారు. ఆ తరువాత ఆమెను సీఎం చంద్రబాబు వద్దకు కూడా తీసుకొచ్చి స్వేచ్ఛగా చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.