ప్రేమను నిరాకరించిందని..ఇంటికెళ్లీ పొడిచేశాడు!
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ విద్యార్థిని పొడిచి చంపేశాడో కిరాతకుడు. తమిళనాడులోని కడలూర్ జిల్లా విరుధాచలం సమీపంలోని కరువెప్పిళకురిచ్చి గ్రామంలో ఈ ఘటన నమోదైంది. ఆ విద్యార్థిని పేరు తిలకవతి. విరుధాచలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంగ్లీష్లో లిటరేచర్ చేస్తోంది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి స్థానికంగా టీ దుకాణాన్ని నడుపుతున్నారు. పేద కుటుంబానికి చెందినప్పటికీ.. చదువులో అత్యంత ప్రతిభావంతురాలని స్థానికులు చెబుతున్నారు.
అదే గ్రామానికి చెందిన రాజన్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో తిలకవతిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విరుధాచలం పోలీసులు రాజన్ను పిలిపించి, హెచ్చరించారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ.. అతను తన మనస్సును మార్చుకోలేదు. ఆమె తనకు దక్కదని నిర్ధారించుకున్నాడు.
పైగా పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆగ్రహంతో తిలకవతిపై కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి ఎవరూ లేని సమయాన్ని చూసి, తిలకవతి ఇంటికి వెళ్లాడు. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచి, పారిపోయాడు. వెళ్తూ, వెళ్తూ ఇంటికి తాళం వేసి మరీ వెళ్లిపోయాడు. తీవ్ర గాయాల బారిన పడ్డ తిలకవతి సంఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
ఆ కాస్సేపటికే ఇంటికి వచ్చిన తిలకవతి తండ్రి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న కుమార్తె కనిపించింది. దీనితో దిగ్భ్రాంతికి గురైన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే రాజన్ను అరెస్టు చేశారు పోలీసులు. శుక్రవారం ఉదయం అతణ్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యానేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రిమాండ్కు తరలించారు.
కేంద్రం నిఘాలో 1181 మంది ఐపీఎస్ అధికారులు: ఏబీ వెంకటేశ్వర రావు ఎఫెక్టేనా?