నితీశ్కు షాక్- చిరాగ్తో బీజేపీ చీకటి ఒప్పందం - సర్వత్రా విమర్శ - జేపీ నడ్డా ఏం చెప్పారంటే..
''బీహార్ ఎన్నికల్లో అసలు ఎన్డీఏ లేనేలేదు. ఎల్జేపీ పార్టీ కూటమి నుంచి బయటికొచ్చి విడిగా పోటీ చేస్తోంది. బీజేపీ, జేడీయూ పైకి కలిసున్నప్పటికీ, లోలోన పరస్పరం వ్యతిరేక ఎత్తుగడలతో ముందుకు పోతున్నారు. ప్రధాని మోదీ శ్రీరాముడైతే.. తాను హనుమంతుడినంటూ స్టేట్మెంట్లు ఇస్తోన్న చిరాగ్ పాశ్వాన్.. తన ఎల్జేపీ అభ్యర్థుల్ని కేవలం జేడీయూపైనే పోటీకి నిలపడం దేనికి సంకేతం? చిరాగ్ తో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుంది. తద్వారా నితీశ్ కుమార్ కు భారీ షాక్ ఇవ్వనుంది.
ఏమాత్రం అవకాశాలున్నా.. ఎల్జేపీకి 20-30 సీట్లోచ్చినా.. నితీశ్ పుట్టిముంచడానికి బీజేపీ వెనుకాడబోదు. నితీశ్ పై జనంలో వ్యతిరేకత దృష్ట్యా ఈసారి బీజేపీ.. ఎల్జేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది..'' అని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మొదలుకొని, రాజకీయ విశ్లేషకులు, సామాన్య జనం దాకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భయంతో 144 రోజులు ఇల్లు కదలని సీఎం నితీశ్ - వలసదారుల్ని గాలికొదిలేశారు- తేజస్వీ నిప్పులు
చిరాగ్తో సంబంధం లేదు
ప్రతిపక్షాల విమర్శలకుతోడు టీవీ డిబేట్లలో విశ్లేషకులు, మీడియాతో మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో జనం కూడా ‘బీజేపీ-ఎల్జేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి' అని తరచూ అంటుండటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. కొద్ది గంటలుగా నడ్డా పలు ఛనెళ్లకు ప్రత్యేక ఇస్తుండగా.. ‘బీజేపీ-ఎల్జేపీ బంధం'పైనే పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. చిరాగ్ పాశ్వాన్ తో తెరవెనుక ఒప్పందాలేవీ లేవని, అలా ఉందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కరాకండిగా చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి ఎల్జేపీ బయటికి ఎందుకొచ్చిందో, జేడీయూ పట్ల బీజేపీ ప్రదర్శిస్తోన్న విశ్వాసాన్ని నడ్డా వివరించే ప్రయత్నంచేశారు.
ఎల్జేపీ కలిసుంటే బాగుండేది..
కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ పార్టీ కూడా ఎన్టీఏలో కలిసి ఉండాలని తాను బలంగా కోరుకున్నట్లు బీజేపీ చీఫ్ నడ్డా చెప్పారు. అయితే, పార్టీ పరంగా ఎల్జేపీకి కొన్ని టార్గెట్లున్నాయని, అవి నెరవేరని కారణంగానే చిరాగ్ ఎన్డీఏకు విడిగా పోటీ చేస్తున్నాడని నడ్డా క్లారిటీ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ, బీజేపీ శ్రేణులు ఎక్కడ ఉంటారో అదే నిజమైన ఎన్డీఏ. మోదీకి హనుమంతుణ్ననో, మరో రకంగానో చిరాగ్ పాశ్వాన్ చేస్తున్న వ్యాఖ్యలతో ఎన్డీఏకు సంబంధం లేదు. చిరాగ్ ఏం మాట్లాడతారనేది ఆయన ఇష్టం. దాన్ని మేం డిసైడ్ చేయలేం'' అని బీజేపీ చీఫ్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు..
మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు
ఏది ఏమైనా నితీశ్ తోనే..
బీహార్ లో 243 స్థానాలకుగానూ ఎన్డీఏలోని జేడీయూ 122, బీజేపీ 121 టికెట్లను పంచుకోవడం తెలిసిందే. హెచ్ఏఎం(మాంఝీ పార్టీ)కి జేడీయూ, వీఐపీ పార్టీకి బీజేపీ సీట్లు అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగుతోన్న నితీశ్ కుమార్ పై సహజంగానే వ్యతిరేకత ఉంటుందన్న విశ్లేషణను నడ్డా కొట్టాపారేశారు. నితీశ్ ఇంకా గొప్పగా పని చేయాలని బీహారీలు కోరుతున్నారే తప్ప ఎన్డీఏ పాలనపై జనంలో వ్యతిరేకత లేదని నడ్డా క్లారిటీ ఇచ్చారు. ‘ఏది ఏమైనా కానివ్వండి.. మేం(బీజేపీ) జేడీయూ తోనే కలిసుంటాం. రేప్పొద్దున మాకు ఎక్కువ సీట్లు వచ్చినా సరే, నితీశ్ కుమారే సీఎంగా కొనసాగుతారు. అదిమా వాగ్ధానం. బీజేపీ మాటకు కట్టుబడి ఉండే పార్టీ'' అని నడ్డా చెప్పారు. ఇప్పటివరకు బీహార్ లో ఎన్డీఏ ప్రచార వ్యూహాలు, సరళిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
Recommended Video
లాలూ ప్రతిబింబమే తేజస్వీ
బీహార్ చీకటి పాలన చూసిందంటే అది ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోనే అని, రాష్ట్రంలో విద్య, ఉపాధి రంగాలను లాలూ పార్టీ నాశనం చేసిందని బీజేపీ చీఫ్ నడ్డా దుయ్యబట్టారు. ‘‘లాలూ, ఆర్జేడీల డీఎన్ఏలోనే అరాచకత్వం ఉంది. తేజస్వీ యాదవ్ ముమ్మాటికీ లాలూ ప్రతిబింబమే. వాళ్లకు విధ్వంసం తప్ప నిర్మాణం తెలీదు. ప్రతిపక్ష నేతగా తేజస్వీ విఫలమయ్యాడు. వరదలు, కరోనా సమయంలో కనుమరుగైపోయాడు. కనీసం అసెంబ్లీ బడ్జెస్ సమావేశాలకు రాలేదు. ఇలాంటి వ్యక్తుల్ని జనం నమ్మరుగాక నమ్మరు'' అని నడ్డా తెలిపారు. 243 స్థానాల బీహార్ అసెంబ్లీకి ఈనెల 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది.