స్మగ్లర్ కోసం ప్రాణాలు వదిలిన కమాండర్
బాలూర్ ఘాట్: భారత జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం వదలడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారని మరో సారి రుజువు అయ్యింది. ఒక స్మగ్లర్ ను పట్టుకునేందుకు నదిలో దూకిన బీఎస్ఎఫ్ కమాండర్ జలసమాధి అయిన సంఘటన అందరిని కలిచివేసింది.
స్మగ్లర్ ను నదిలో వెంటాడిన బీఎస్ఎఫ్ కమాండర్ వీరమరణం పొందాడు. బీఎస్ఎఫ్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ నది ప్రవహిస్తుంది. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ తిరుగుతుంటారు.
ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సెక్టార్ కమాండర్ ప్రశాంత్ రాయ్ విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం భారత్ భూభాగంలోకి ఒక స్మగ్లర్ ప్రవేశిస్తున్న విషయం ప్రశాంత్ రాయ్ గుర్తించాడు. చోరబాటుదారుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
ఆ సందర్బంలో అతను నదిలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రశాంత్ రాయ్ నదిలో దూకి స్మగ్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొంత దూరం ఈదిన తరువాత ప్రమాదవశాత్తు ప్రశాంత్ రాయ్ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలి పెట్టాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.