ఏపీకి హోదాపై సీడబ్ల్యూసీలో చర్చ, ఆ పార్టీలతో కలిసి ముందుకు: సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆదివారం సీబ్ల్యుసీ సమావేశమైంది. ఈ సమావేశంలో 2019 ఎన్నికల కోసం పొత్తులు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, ఖర్గే, అహ్మద్ పటేల్, అంబికా సోనీ తదితరులు హాజరయ్యారు.
2019 నాటికి భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వస్తామని సోనియా గాంధీ చెప్పారు. తామంతా రాహుల్ గాంధీ వెంట ఉన్నామని, ప్రమాదకరమైన మనుషుల నుంచి మా వారిని మేం కాపాడుకుంటామని చెప్పారు. సిసలైన ప్రజాస్వామ్యానికి అర్థం చెప్తామన్నారు. కాంగ్రెస్ అంటే ఏంటో అవిశ్వాస తీర్మాన చర్చలోనే తెలిసిపోయి ఉంటుందని, బీజేపీ ఎన్ని కుట్రపూరిత రాజకీయాలు చేసినా కాంగ్రెస్ వాటిని ప్రేమతో స్వీకరిస్తుందన్నారు.
ఈ సమావేశంలో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి అడ్డంకులున్నా హోదా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదే సమయంలో ఒడిశాకు హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర నేతలు కోరారు.
దీనిపై సోనియా, రాహుల్ స్పందిస్తూ.. అప్పటి ప్రధాని ప్రకటనను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, ఏపీకి ప్రత్యేక హోదాకు, మిగిలిన రాష్ట్రాల డిమాండ్లకు పోలిక లేదన్నారు. అవకాశమున్నంత వరకు పార్టీ ఎన్నికల ప్రణాళికను ముందే విడుదల చేయాలని నిర్ణయించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు.