వినాయక మండపానికి రూ.265 కోట్ల బీమా, ఆదాయం కూడా కోట్లలో
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రులకు ముంబై ఓ ప్రత్యేకం. ఇక్కడ తాజాగా ఓ గణేషుడి మండపానికి దాదాపు రూ.265 కోట్ల ఇన్సురెన్స్ చేశారు.
ఈ వినాయక మండపానికి అక్షరాలు రూ.264.3 కోట్ల బీమా చేశారట. కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన ఈ మండపానికి అత్యంత ఖరీదైన మండపంగా పేరు ఉంది. మండపంలో 14.5 అడుగుల ఎత్తైన వినాయకుడిని ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఈ మండపానికి కోట్లలో బీమా చేస్తుంటారు.
2016లో రూ.300 కోట్లకి, 2017లో 264.3 కోట్లకి బీమా చేసింది. తమ వినాయకుడికి ఎంతో విలువైన ఆభరణాలు అలంకరిస్తామని, అలాగే, కమిటీ సభ్యులు, కార్యకర్తలకు కూడా వ్యక్తిగత బీమాలు చేస్తామని కమిటీ సభ్యుడు ఆర్జి భట్ చెప్పారు.
ఈ ఏడాది బీమాలో 19 కోట్లు బంగారం, వెండి, నగదుకు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, విద్యుత్ షాట్ సర్క్యూట్లు వంటి ప్రమాదాల నుంచి రక్షణకు కోటి రూపాయలు బీమా చేసినట్లు తెలిపారు. మండపానికి, ఎగ్జిబిషన్ ప్రాంగణానికి 20 కోట్ల బీమా ఉందని చెప్పారు. తమ కమిటీకి సభ్యులు, కార్యకర్తలు కలిపి 2,244 మంది ఉన్నారని, వారందరికీ తలో 10 లక్షల రూపాయల చొప్పున వ్యక్తిగత ప్రమాద బీమా చేశామన్నారు. ఇలా అన్ని రకాల బీమాలు కలిపి రూ.264 కోట్లు అయిందన్నారు.
ఇక్కడి గణపతికి ఐదు రోజుల్లో వివిధ పూజలు తదితరాల రూపేణా అక్షరాల రూ.8 కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చాయట. కమిటీ ప్రతినిధి సతీష్ నాయక్ స్వయంగా ఈ సంగతి చెప్పారు. గతేడాది రూ.7.95 కోట్లు వచ్చాయి. ఈ మండపాన్ని కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంచుతారు.