ఒక దేశం- ఒక ఎన్నిక: సాధ్య సాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
ఒక దేశం-ఒక ఎన్నిక పై ప్రధాని మోడీ నేతృత్వంలోని జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అయితే ఒక దేశం - ఒక ఎన్నిక పై ప్రధాని మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతారని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సంబంధిత వ్యక్తులతో చర్చించిన తర్వాత ప్రధాని దీనిపై ఒక నిర్ణయం తీసుకుని కమిటీ వేస్తారు. అది కూడా నిర్దేశిత సమయంలోనే నివేదిక ఇవ్వాలని ప్రధాని సూచిస్తారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు.
ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక దేశం ఒకే ఎన్నిక ఆలోచనతో చాలా పార్టీలు ఏకీభవించాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇక రెండు కమ్యూనిస్ట్ పార్టీలు విధానాలతో విభేదించినప్పటికీ..ఆలోచనతో మాత్రం విభేదించలేదని తెలిపారు. దీని అమలును మాత్రమే విబేధించినట్లు ఆయన చెప్పారు. ఇక ఈ అంశంతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ150వ వేడుకలను ఎలా నిర్వహించాలి అనే ఇతర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
అఖిలపక్ష సమావేశానికి 21 పార్టీల అధినేతలు హాజరయ్యారు. మొత్తం 40 పార్టీల అధినేతలను కేంద్రం పిలిచింది.ఇందులో 21 పార్టీలు హాజరయ్యాయి. మరో మూడు పార్టీలు తమ అభిప్రాయాన్ని ఓ లేఖ ద్వారా తెలిపాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొందరు నేతలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి గైర్హాజరైన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లాంటి ప్రముఖులు ఉన్నారు.