'కలాంకు నివాళిగా మెమెన్ ఉరిపై ఆలోచించండి'
న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరి శిక్ష విషయంలో మరోసారి ఆలోచించాలని పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్కృష్ణ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉరిశిక్ష అమలు ఇష్టం ఉండదని, అందుకైనా యాకుబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్షను అంగీకరించాలని ఆయన కోరారు.
యాకుబ్ మెమెన్కు ఉరిశిక్షను రద్దు చేస్తే కలామ్కు నివాళులు అర్పించినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ప్రణబ్ ముఖర్జీకి ఓ లేఖ రాశారు. మరణ శిక్ష అమలును వ్యతిరేకిస్తూ కలాం ఈ నెలారంభంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.
యాకుబ్ మెమెన్ మెర్సీ పిటిషన్ను ప్రణబ్ ముఖర్జీ నిరుడు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో యాకుబ్ మెమెన్ మరోసారి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు. దాన్ని రాష్ట్రపతి బుధవారం సాయంత్రం హోం మంత్రిత్వ శాఖకు పంపించారు. హోం మంత్రిత్వ శాఖ ఉరిశిక్షకు అనుకూలంగానే అభిప్రాయం వెల్లడించింది.
యాకుబ్ మెమెన్కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో గోపాల్ కృష్ణ గాంధీ - 1997లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులకు మరణశిక్షను రద్దు చేస్తూ క్షమాభిక్ష ప్రసాదించిన విషయాన్ని గుర్తు చేశారు.