సామాన్యులకు ఊరట: ఆధార్ కోసం వేధిస్తే... కోటి జరిమానా,జైలు శిక్ష
ఢిల్లీ: ఇప్పటి వరకు బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు కొనాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండేది. వీటితో పాటు రేషన్ కార్డుకు అయినా, పాస్పోర్టు పొందాలంటే కూడా ఆధార్ అడిగేవారు. ఇకపై ఆధార్ కార్డు ఇలాంటి వాటికి తప్పని సరికాదు. అడ్రస్ రుజువు కింద ఏదైనా సంస్థ ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగితే అలాంటి సంస్థలపై రూ. కోటి జరిమానాతో పాటు మూడు నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేలా కేంద్రం కొత్త సవరణ తీసుకురానుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు కేవైసీ ఫార్మాలటీస్లో భాగంగా ఆధార్ వివరాలు పొందు పరిచే అంశం కూడా కస్టమర్ ఇష్టానికే వదిలేస్తే స్పష్టత ఇచ్చింది. అంతేకాదు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజల డబ్బు ఉన్న ప్రభుత్వ సంక్షేమపథకాలకు మాత్రమే ఆధార్ను తప్పనిసరిచేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఒక వేళ ఆధార్ తప్పని సరి చేయాలని భావిస్తే ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తూ వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అదికూడా సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది పార్లమెంటులో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఒకవేళ పార్లమెంటు ఆమోదం తెలిపితే కొత్త సవరణలతో కూడిన చట్టం వెంటనే అమల్లోకి వస్తుంది.
అన్నిటికీ ఆధార్ అనుసంధానం సరైన పద్దతి కాదని గతేడాది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు చట్టసవరణ కూడా చేయనుంది. అంతేకాదు మైనర్లుగా ఉన్న సమయంలో ఆధార్ నమోదు చేసుకున్నవారు మేజర్లు అయ్యాక అంటే 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత ఆధార్ ఉండాలా లేదా అనేది కూడా నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆధార్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారికి కఠిన శిక్ష విధించడం జరుగుతుందని తెలిపింది. ఇలా చేసిన వారికి రూ. 50లక్షలు జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు శిక్ష విధించడం జరుగుతుంది.