పైస్థాయిలో భారీగా.. కింది స్థాయిలో కొంచమేనా? ఇన్ఫోసిస్ అప్రైజల్ పై నారాయణమూర్తి అసంతృప్తి
సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో అమలవుతున్న అప్రైజల్ విధానంపై ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బెంగళూరు: సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో అమలవుతున్న అప్రైజల్ విధానంపై ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థలో పైస్థాయి ఉద్యోగులకు భారీగా.. కింది స్థాయి ఉద్యోగులకు స్వల్పంగా వేతనాలు పెంచడం దారుణమన్నారు.
ఉన్నతోద్యోగులకు 60-70 శాతం మేరకు వేతనాలు పెంచుతూ, కిందిస్థాయిలో అత్యధిక ఉద్యోగులకు 6-8 శాతం మాత్రమే జీతాలు పెంచుతున్నారని, ఇది అత్యంత అనైతికమని బోర్డుకు చురకలంటిస్తూ నారాయణమూర్తి ఓ లేఖ రాశారు.
ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు ఏడాదికి రూ.4.62 కోట్ల వేతనం, ఆపైన రూ.3.88 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు.
కేవలం 24 శాతం మంది ప్రమోటర్లు మాత్రమే రావు వేతన పెంపెపై అనుకూలంగా ఉన్న విషయాన్ని నారాయణమూర్తి గుర్తుచేస్తూ, ఇలా చేయడం వల్ల బోర్డుపై ఉద్యోగులకు ఉన్న నమ్మకం పోతుందని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఉన్న విశాల్ సిక్కాకు ఇస్తున్న ప్యాకేజీ పెంచిన విషయంలో కూడా బోర్డు డైరెక్టర్ల నిర్ణయంపై తనకు అసంతృప్తిగానే ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.