ఫాదర్ ఆఫ్ కర్ణాటక ఎవరో తెలుసా, పోలీసులకు ఫిర్యాదు, నరేంద్ర మోడీ విచార్ మంచ్ !
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ పేరుతో ఉన్న ఓ వెబ్ సైట్ మీద నరేంద్ర మోడీ విచార్ మంచ్ అధ్యక్షుడు సీటీ. మంజునాథ్ కర్ణాటకలోని మండ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేడీఎస్ నాయకులు కర్ణాటక ప్రజలను అవమానించే విధంగా వెబ్ సైట్ లో వ్యాఖ్యలు చేశారని మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జేడీఎస్ నాయకులు మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడ ఫోటో, ఫ్రోఫైల్ పెట్టి ఫాదర్ ఆఫ్ అవర్ స్టేట్-ఫాదర్ ఆఫ్ కర్ణాటక అని ప్రచురించారని, కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన అమరవీరులు, కన్నడిగులను అవమానించారని సీటీ మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కన్నడ బాషను కాపాడుకోవడం కోసం ఎంతో మంది రచయితలు, కవులు, కళాకారులు వారి జీవితాలు త్యాగం చేశారని సీటీ మంజునాథ్ అన్నారు. విజయనగర సామ్రాజ్యంలో రహదారుల్లో రత్నాలు, వజ్రాలు కుప్పలుగా పోసి విక్రయించిన చరిత్ర కర్ణాటకకు ఉందని సీటీ. మంజునాథ్ గుర్తు చేశారు.
ప్రత్యేక కర్ణాటక రాష్ట్రం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారని సీటీ. మంజునాథ్ అన్నారు. ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరవేసిన ప్రథమ కన్నడిగుడు హెచ్.డి. దేవేగౌడ అని తాము గర్వంగా చెప్పుకుంటామని, ఆయన అంటే తనకు ఎంతో గౌరవం ఉందని సీటీ. మంజునాథ్ అన్నారు.
జేడీఎస్ నాయకులకు దేవేగౌడ ఫాదర్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు తండ్రి కావచ్చు, అయితే ఫాదర్ ఆఫ్ కర్ణాటక అంటూ కన్నడిగులను అవమానించారని, ఆ మాట ఎలా అంటారని సీటీ. మంజునాథ్ ప్రశ్నించారు. వెంటనే వెబ్ సైట్ నిర్వహకుల మీద చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని సీటీ మంజునాథ్ మంగళవారం మీడియాకు చెప్పారు.