Coronavirus: 19 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులకు ఆశ్రయం, మాజీ మంత్రిపై దేశద్రోహం కేసు !
బెంగళూరు: దేశ మొత్తం కారోనా వైరస్ (COVID 19) వ్యాధి వ్యాపించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ కార్యక్రమాలకు హాజరైన వారి నుంచి దేశంలో 63 శాతం కరోనా కేసులు నమోదైనాయని ఆరోపణలు ఉన్నాయి. తబ్లీగి జమాత్ కార్యక్రమాలకు హాజరైన వారిని గుర్తించి కరోనా క్వారంటైన్ కు తరలించాలని దేశం మొత్తం గాలిస్తున్నారు. అయితే ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ కార్యక్రమాలకు హాజరైన 19 మంది విదేశీయులను బెంగళూరులోని ఓ మసీదులో అక్రమంగా దాచిపెట్టారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ మీద, కార్పోరేటర్, మసీదు పెద్ద మీద బెంగళూరు పోలీసు కమిషన్ కు దేశద్రోహం చేశారని ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. నలుగురు విదేశీయులను అరెస్టు చేసిన పోలీసులు పరారైన మరో 15 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.
Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !
దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన దేశ, విదేశాల్లోని ముస్లీంలు హాజరైనారు. తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారు ఢిల్లీ నుంచి దేశంలోని వివిద రాష్ట్రాలకు వెళ్లిపోయారు. తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన దేశ, విదేశీయుల నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు గుర్తించారు. ఎలాంటి చికిత్స చేసుకోకుండా తబ్లీగి జమాత్ సభ్యులు దేశం మొత్తం తిరిగేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇప్పటికే అధికారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
విదేశీ తబ్లీగిల కోసం వేట
ఢిల్లీలోని తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీయులు వీసా నియమాలు ఉల్లంఘించి దేశంలోని వివిద ప్రాంతాలకు వెళ్లారని, వారి వలన కరోనా వైరస్ వ్యాపించిందని వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం వారి వీసాలను రద్దు చేసి కేసులు నమోదు చేసింది. అప్పటి నుంచి విదేశాల నుంచి తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన తరువాత తప్పించుకుని తిరుగుతున్న తబ్లీగి జమాత్ సభ్యుల కోసం దేశం మొత్తం గాలిస్తున్నారు.
పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు
బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ కావడంతో 10 రోజుల క్రితమే ఆ ప్రాంతాన్ని సీల్ డౌన్ చేశారు. ఇటీవల పాదరాయనపురలో కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులను క్వారంటైన్ తరలించడానికి బీబీఎంపీ అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది, పోలీసుల మీద అల్లరిమూకలు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు గాయాలు కావడంతో సుమారు 150 మందికిపై బెంగళూరు జేజే నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల హస్తం ?
పాదరాయనపురలో పోలీసులు, వైద్య సిబ్బంది, బీబీఎంపీ అధికారులు, ఆశా వర్కర్ల మీద దాడులు జరగడం వెనుక మసీదులో తలదాచుకున్న విదేశీ తబ్లీగి జమాత్ సభ్యుల హస్తం ఉందని, వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని బీజేపీ నాయకులు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్, జేజే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండోనేషియా, కిర్గిజిస్తాన్ కు చెందిన 19 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులు మసీదులో తలదాచుకోవడానికి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్, స్థానిక కార్పోరేటర్ ఇమ్రాన్ పాష, మసీదు పెద్ద షనావుల్లా కారణం అని బీజేపీ నాయకులు బెంగళూరు పోలీసుల కమిషనర్ భాస్కర్ రావ్ కు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని చామరాజనగర నియోజక వర్గం ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్, పాదరాయనపుర కార్పోరేటర్ ఇమ్రాన్ పాష, పాదరాయనపురలోని సుబానియా మసీదు పెద్ద షనావుల్లా ఇండోనేషియా, కిర్గిజిస్తాన్ దేశాలకు చెందిన 19 మందిని మసీదులో దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇండోనేషియా, కిర్గిజిస్తాన్ దేశాలకు చెందిన 19 మంది విదేశీయులు ఢిల్లీ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరై అక్కడి నుంచి ఎక్కడెక్కడో తిరిగి తరువాత బెంగళూరు వచ్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కు తెలిసినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇండోనేషియాకు చెందిన 10 మంది, కిర్గిజిస్తాన్ కు చెందిన 9 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులు బెంగళూరులోని పాదరాయనపురలోని మసీదులో అక్రమంగా తలదాచుకున్నారని పోలీసులు విచారణలో వెలుగు చూసింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు !
పాదరాయనపురలోని సుబానియా మసీదులో తలదాచుకున్న విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులు రెచ్చగొట్టడం వలనే పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ బెంగళూరు దక్షిణ విభాగం బీజేపీ అధ్యక్షుడు ఎన్ఆర్. రమేష్ జేజే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్, కార్పోరేటర్ ఇమ్రాన్ పాష, సుబానియా మసీదు పెద్ద షనావుల్లా ఇండోనేషియా, కిర్గిజిస్తాన్ కు చెందిన 19 మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చారని, వారు దేశద్రోహానికి పాల్పడ్డారని ఎన్ఆర్. రమేష్ ఫిర్యాదు చెయ్యడంతో జేజే నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
సీఎం యడియూరప్ప ఫైర్
ఇటీవల పాదారయనపురలో పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసింది నిరక్షరాసులని, వారు అమాయకులు అని వెనుక వేసుకువచ్చిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ మీద కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారిని వెనుక వేసుకువస్తారా ?, అసలు మీరేమనుకుంటున్నారు అంటూ కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప మండిపడ్డారు.
Recommended Video
చిక్కుల్లో కాంగ్రెస్, విదేశీ తబ్లీగి సభ్యులు అరెస్టు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ విషయంపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు. ఇప్పటికే నలుగురు విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులను అరెస్టు చెయ్యడంతో మిగిలిన 15 మంది విదేశీయులు పారిపోయారని బెంగళూరు పోలీసులు అంటున్నారు. మొత్తం మీద విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులకు ఆశ్రయం ఇచ్చిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఇరకాటంలో పడింది.