కశ్మీరీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రభుత్వం: కేంద్రంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా
Recommended Video
న్యూఢిల్లీ: భారత్ పై ఆశలు, నమ్మకం పెట్టుకున్న కశ్మీరీలను ఈరోజు కేంద్రప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్పై కుట్రపూరిత ధోరణితో వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. తాము ముందునుంచి భావిస్తున్నట్లుగానే కేంద్రం నిర్ణయం తీసుకుందని ఫైర్ అయ్యారు ఒమర్ అబ్దుల్లా. జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్యంపై గొంతు ఎత్తిన వారిని భద్రతాదళాల ద్వారా తమ గొంతును నొక్కివేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఒమర్ అబ్దుల్లా.
Statement of Omar Abdullah, Vice-President of National Conference and former Chief Minister of Jammu & Kashmir, on revoking of Article 370 and other decisions announced by Government of India. pic.twitter.com/L9RXggb10k
— ANI (@ANI) August 5, 2019
ఆర్టికల్ 370 మరియు 35 ఏలను రద్దు చేయడంపై పలు ప్రాథమిక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. నాడు భారత్లో జమ్ముకశ్మీర్ ఏ ఒప్పందాలపై ఏర్పడింది అనేదానిపై చర్చజరగాలని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఆమోదం లేకుండా పార్లమెంటులో చేసిన చట్టాలు చెల్లుబాటు కావని చెప్పిన అబ్దుల్లా... ఈ నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవడం జరిగిందని మండిపడ్డారు.
అంతేకాదు చాలా అన్యాయంగా నిర్ణయం తీసుకున్నారని, రాజ్యాంగ విరుద్ధమని ఫైర్ అయిన అబ్దుల్లా దీనిపై కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో సుదీర్ఘ పోరాటాలు చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందని దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వెనక్కు తగ్గదని కచ్చితంగా పోరాడుతుందని ఒమర్ అబ్దుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే ఒమర్ అబ్దుల్లాను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గృహనిర్భంధం చేశారు. నిన్నటి నుంచి ఒమర్ అబ్దుల్లాను బయటకు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మరోవైపు జమ్ము కశ్మీర్ అంతా భద్రతాదళాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా తుపాకులతో కవాతు చేస్తున్న సైన్యం కనిపిస్తోంది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ ఏమైనా అలజడులు జరిగే అవకాశం ఉంటుందని కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే పలువురు ముఖ్యనేతలను గృహనిర్బంధం చేసింది. అయితే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రతిపాదన చేయగానే కశ్మీరి పండిట్లు సంబురాలు చేసుకోవడం కనిపించింది. అయితే సభలో మాత్రం కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ మూడు పార్టీలకు చెందిన ఎంపీలు సభలో నిరసనలు తెలిపారు. ఆ తర్వాత పార్లమెంటులో కింద కూర్చుని ధర్నాకు దిగారు. అయితే సభలో మెజార్టీ విపక్ష పార్టీలు ఆర్టికల్ 370ని రద్దు చేస్తాయని భావించిన ఒమర్ అబ్దుల్లాకు నిరాశే మిగిలింది. ఒక్క జమ్ముకశ్మీర్కు చెందిన నేతలు మినహా మెజార్టీ పార్టీలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి.