కశ్మీర్లో ఆందోళనలు జరగలేవు.. 20 మంది కూడా గుమికూడలేరన్న హోంశాఖ
శ్రీనగర్ : కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో స్థానికులు ఆందోళన చేశారనే వార్తను కేంద్ర హోంశాఖ ఖండించింది. కశ్మీర్లో అలాంటి ఆందోళనలు ఎవరూ చేయలేదని స్పష్టంచేసింది. శ్రీనగర్లో దాదాపు 10 వేల మంది యువకులు నిరసన చేపట్టారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని తేల్చిచెప్పింది. కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని .. సత్యదూరమైన వార్తలను ప్రసారం చేయొద్దని మీడియాకు హితవు పలికింది.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి, కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శ్రీనగర్లో యువత ఆందోళన చేపట్టారని ప్రచారం జరిగింది. రోడ్లమీదికొచ్చిన వారిని వెనక్కి పంపించేందుకు పోలీసులు పెల్లెట్ గన్లు వాడారాని కూడా వార్తలొచ్చాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆందోళన చేపట్టారని ప్రచారం జరిగింది. కశ్మీర్లో శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 500 మంది రాజకీయ నేతలు, వేర్పాటువాద నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉండటంతో అభివృద్ధికి నోచులేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కశ్మీర్ విభజన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యాహక్కు చట్టం అమలు కాలేదని, రిజర్వేషన్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్లో దాదాపు 50 వేల మంది ప్రజలు చనిపోయారని గుర్తుచేశారు. ఈ క్రమంలో కశ్మర్లో స్థానికులు ఆందోళన చేపట్టారనే ప్రచారం జరిగింది. దీనిని కేంద్రహోంశాఖ తప్పుపట్టింది. మీడియా అసత్య వార్తలు ప్రసారం చేయొద్దని సూచించింది. అది తప్పుడు వార్త అని .. శ్రీనగర్, బారాముల్లాలో 20 మంది కన్నా ఎక్కువ గుమిగూడి లేరని కేంద్రహోంశాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదివరకు ఒక వార్తాసంస్థ 10 వేల మంది శ్రీనగర్లో ఆందోళన చేపడుతున్నారని రిపోర్ట్ చేయడంతో .. హోంశాఖ స్పందించింది.