ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేత.. కానీ: వీధుల్లో పడి తిరుగుతామంటే కష్టం: ముఖ్యమంత్రి ట్వీట్..డిలేట్
న్యూఢిల్లీ: లాక్డౌన్. దేశం మొత్తాన్నీ స్తంభింపజేసిన ఉదంతం. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ ప్రజలను ఇళ్లకు పరిమితం చేసింది. రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ఢిల్లీ మత ప్రార్థనల అనంతరం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో.. దీన్ని మరి కొంతకాలం పాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడ్డాయి.
Recommended Video
ట్వీట్ ద్వారా వెల్లడించిన ముఖ్యమంత్రి
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఏప్రిల్ 14వ తేదీ తరువాత కూడా లాక్డౌన్ను పొడిగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సందిగ్ధావస్థకు తెర దించారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. ఈ నెల 14వ తేదీన లాక్డౌన్ ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
వీధుల్లో తిరుగుతామంటే కష్టం..
లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన ప్రజలందరూ స్వేచ్ఛగా వీధుల్లో పడి తిరుగాడలనేది దాని సారంశం కాదని అన్నారు. ఆ తరువాత కూడా ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనప్పటికీ.. ప్రజల రోజువారీ కార్యక్రమాలు, దినచర్యలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని పెమా ఖండు చెప్పారు. ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు పెమాఖండు. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని సూచించారు.
సోషల్ డిస్టెన్సింగ్తోనే..
సామాజిక దూరంతోనే కరోనా వైరస్ను పారద్రోలగలమని అన్నారు. సామాజిక దూరాన్ని పాటించాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి 21 రోజుల పాటు లాక్డౌన్ను ప్రకటించాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి భారతీయుడూ బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగాడితే.. మళ్లీ దేశం మొత్తం లాక్డౌన్ దిశగా సాగుతోందనే హెచ్చరికలను ఆయన జారీ చేశారు.
లాక్డౌన్ వృధా కాకూడదు..
21 రోజుల పాటు దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయిందని, కరోనా వైరస్పై పోరాటాన్ని సాగించడానికి ఉద్దేశించిన ఈ లాక్డౌన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాకూడదనే సందేశాన్ని ప్రధానమంత్రి ఇచ్చారని పెమా ఖండు తెలిపారు. లాక్డౌన్లో ఉన్నప్పటి పరిస్థితులను ఆ తరువాత కూడా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని ప్రతి పౌరుడు దీన్ని తమ ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలని, అప్పుడే పోరాటం విజయవంతమౌతుందని ప్రధాని సూచించినట్లు తెలిపారు.