కామ్రేడ్ కేసీఆర్ ప్రభావం..! కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకమన్న కేరళ సీఎం పినరయ్...!!
తిరువనంతపురం/హైదరాబాద్ : కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్థాయని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. తమ మధ్య జరిగిన ఈ సమావేశం గురించి విజయన్ మంగళవారం మీడియాకు వివరించారు.
కేంద్రంలో ప్రాంతీయపార్టీలే కీలకం..! కేసీఆర్ కు జతకట్టిన కేరళ సీఎం..!!
తమ మధ్య కీలక చర్చ జరిగిందని తెలిపారు. త్వరలో సమాఖ్య, లౌకిక విధానాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. నిన్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తో చాలా ప్రాముఖ్యతగల సమావేశం జరిగింది. దేశ రాజకీయ పరిస్థితుల గురించి చంద్రశేఖర్ రావు చర్చించారు. ఆయన చెప్పిన విషయాల ప్రకారం... దేశంలో ఎన్డీఏ, యూపీఏ మెజార్టీ సాధించలేవు. ప్రధానమంత్రి అభ్యర్థి గురించి నిన్న జరిగిన సమావేశంలో చర్చించలేదు అని వ్యాఖ్యానించారు.
ప్రత్యామ్నాయం కావాలంటున్న పినరయ్..!
కాగా, దేశ రాజకీయాలు, సమాఖ్య కూటమిపై చర్చించడానికి కేసీఆర్.. ఈ నెల 13వతేదీన తమిళనాడు రాజధాని చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్తో ఆయన నివాసంలో సమావేశం కానున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజున వీరిద్దరి మధ్య సమావేశం జరగడం లేదని డీఎంకే వర్గాలు తెలిపాయి.
దక్షిణ భారతాన్నిచుట్టేస్తున్న కేసీఆర్..! ఫెడరల్ ఫ్రంట్ కీలక అడుగులు..!!
మే 19న జరిగే రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తూ స్టాలిన్ ప్రస్తుతం తీరిక లేకుండా ఉన్నారని డీఎంకే స్పష్టం చేసింది. గతంలో స్టాలిన్ను కేసీఆర్ ఓ సారి కలిశారు. అయితే, ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం డీఎంకే.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.
విజయం మాదే అంటున్న బీజేపి..! ప్రజాబలం తమకు ఉందంటున్న అమీత్ షా..!!
ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల్లో తాము భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఈ సారి అధిక మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దేశ ప్రజలకు నమ్మకం ఉందని, ఆయన అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలు దేశంలో మార్పులను చూశారని, దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని అమీత్ షా అన్నారు.