వామపక్షాలను టార్గెట్ చేసిన కామ్రేడ్ కేసీఆర్..! ఈ నెల 13 న తమిళనాడు టూర్..!!
తమిళనాడు/హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు శైలి ఒక్కోసారి ఎంతో భిన్నంగా ఉంటుంది. చేసే ప్రతి పనికి ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసి అందరి దృష్టిని తన మీదకు మళ్లించుకుంటారు. మళ్లీ కొన్నాళ్లు సైలెంట్ అయిపోతారు. మళ్లీ వార్తల్లో నిలుస్తారు. ఇలా ప్రత్యర్థులకు అందని రాజకీయ చతురతతో ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పేరిట చంద్రశేఖర్ రావు చేపట్టిన దక్షిణభారతదేశ యాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా వామపక్షాలను చంద్రశేఖర్ రావు ఎందుకు టార్గెట్ చేశారన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. వాస్తవానికి గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన వచ్చినప్పుడు వామపక్షాలను అందులోకి చేర్చుకోవాలన్న విషయాన్ని చంద్రశేఖర్ రావు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన పూర్తిగా ప్రాంతీయ పార్టీలపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్లోకి వామపక్షాలను తీసుకురావాలన్న వ్యూహం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ తో ఆయన నివాసంలో సమావేశం అవనున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై ఇద్దరు నాయకులు చర్చించుకోనున్నారు.
పార్లమెంటు ఎన్నికలు, తదనంతరం తలెత్తే పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు పర్యటనల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి సోమవారం ఉదయం సిఎం చంద్రశేఖర్ రావు తో ఫోన్లో మాట్లాడారు. మొత్తానికి థర్డ్ ఫ్రంట్ దిశగా చంద్రశేఖర్ రావు మళ్లీ చురుగ్గా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.