బెంగాల్ వైద్యులకు ఎయిమ్స్ డాక్టర్ల సపోర్ట్ .. రేపు విధుల బహిష్కరణ
న్యూఢిల్లీ : బెంగాల్ ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతుంది. వారిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నట్టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెసిడెంట్ వైద్యులు తెలిపారు. దీంతో వైద్యులపై దాడి చేస్తే ఊరుకోబోమనే సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినట్లైంది. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వైద్యులకు మద్దతు తెలిపింది. శుక్రవారం నల్ల బ్యాడ్జీలు కట్టుకొని .. నిరసన తెలియజేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు పిలుపునిచ్చింది.
ఎయిమ్స్ వైద్యుల మద్దతు
శుక్రవారం ఉదయం నుంచి ఎయిమ్స్లో విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు. అంతేకాదు బ్యాడ్జీ ధరించి నిరసన తెలుపుతామని స్పష్టంచేశారు. ఇటీవల కోల్ కతాలో ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేశారు. దీంతో ఓ వైద్యుడు తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారు. దాడులను నిరసిస్తూ ఆస్పత్రిలో వైద్యసేవలు చేయబోమని తేల్చిచెప్పారు వైద్యులు. దీంతో బెంగాల్ సీఎం రంగంలోకి దిగి వైద్యులకు అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వారికి ఎయిమ్స్ వైద్యులు బాసటగా నిలువడం కొండంత ధైర్యాన్నిస్తోంది.
బాసటగా ...
బెంగాల్ వైద్యులకు మేం అండగా నిలుస్తాం. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడం ఏంటి అని ప్రశ్నించారు. వారికి మద్దతు తెలుపుతూ గురు, శుక్రవారాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. రెండురోజుల్లో ఓపీ చూడబోమని, దీంతోపాటు రౌండ్లకు వెళ్లడం ఉండదని స్పష్టంచేశారు. కానీ ఎమర్జెన్సీ కేసులను మాత్రం హ్యాండిల్ చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా బెంగాల్ ప్రభుత్వం తమ పట్టు వీడాలని కోరారు. వైద్యుల కోరిన భద్రత కల్పిస్తే .. అందరం విధుల్లో చేరేందుకు సిద్ధమని స్పష్టంచేశారు.
ఐఎంఏ పిలుపు ..
మరోవైపు దేశంలో ఉన్న వైద్యులందరూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలియజేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని అన్నిరాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులకు అందజేశామని పేర్కొన్నది. అంతేకాదు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన తెలియజేసి .. ప్రధానికి తమ డిమాండ్ల చిట్టాతో జిల్లా కలెక్టర్కు లేఖ అందజేయాలని సూచించింది.
ఏం జరిగిందంటే ..
ఆరోగ్యం బాగోలేక టాగ్రాకు చెందిన మహ్మద్ సాహిద్ అనే 75 ఏళ్ల వృద్దుడు ఎన్ఆర్ఎస్ దవాఖానలో సోమవారం చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆ రోజు రాత్రి 11 గంటలకు చనిపోయారు. సాహిద్కు సరైన వైద్యం అందించలేదని రోగి బంధువులు ఆరోపించారు. అంతేకాదు చనిపోయాక సాహిద్ మృతదేహం అప్పగించేందుకు కూడా ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఆస్పత్రిలో రోగి బంధువుల బీభత్సం సృష్టించారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో దాడి చేసినట్టు సిబ్బంది తెలిపారు. వైద్యం అందించిన ఇద్దరు జూనియర్ డాక్టర్లపై దాడికి తెగబడ్డారు. అందులో పరిబహ ముఖపోధ్యాయ్ అనే జూనియర్ డాక్టర్పై వెనక నుంచి ఇటుక పెళ్లతో కొట్టడంతో ఆయన పుర్రె పగిలింది. దీంతో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు.
Recommended Video
వైద్యుడికి తీవ్ర గాయం ..
వైద్యులు పరిబహను క్షుణ్ణంగా పరిశీలించారు. అతని పుర్రెకు గాయమైందని .. వైద్యం అందిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. కానీ మెదడు అసాధారణంగా పనిచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సీటీ స్కాన్ తీసి .. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పుర్రె గాయానికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స నిర్వహించామని ... ప్రస్తుతం మాత్రం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియజేశారు.