ఇన్క్రెడిబుల్: అమీర్ స్థానంలో బిగ్ బీ, ప్రియాంక!
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు కొత్త బ్రాండ్ అంబాసిడర్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్(బిగ్ బీ), ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. వీరిద్దరినీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్టు సమాచారం.
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా ఈ ప్రచారానికి ముఖచిత్రంలా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ఖాన్ సేవలందించారు.
అయితే ఇటీవల అసహనంపై అమీర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి. కాగా, 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్గా ఆయన కాంట్రాక్ట్ పూర్తవడంతో కేంద్రం అతనికి బదులు అమితాబ్, ప్రియాంకలను ఎంపిక చేసింది.
అంతకుముందు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను ప్రచారకర్తగా నియమించాలని భావించినప్పటికీ చివరకు అమితాబ్, ప్రియాంకలను పర్యాటక మంత్రిత్వ శాఖ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక భారత పర్యాటక రంగానికి ప్రచార సారథులుగా అమితాబ్, ప్రియాంక ప్రాచుర్యం కల్పించనున్నారు.