రాహుల్ ఓ గప్పీదాస్.. హార్దిక్ మీడియా క్రియేటెడ్ లీడర్: పీటీఐ ఇంటర్వ్యూలో విజయ్ రూపానీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గల ప్రజాదరణ అంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆరోపించారు. అందుకే వివిధ కులాల నేతల మద్దతు కూడగట్టిందన్నారు. ప్రత్యేకించి పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ, గిరిజన నాయకుడు ఛోటూ వాసవ వంటి ఆశ్రయిస్తున్నదన్నారు.
వీరందరికీ వారివారి సామాజిక వర్గాల్లో ఎలాంటి మద్దతు లేదని చెప్పారు. ప్రత్యేకించి 'పాస్'కన్వీనర్ హార్దిక్ పటేల్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ అవకాశాలపై ఎటువంటి ప్రభావం చూపదని ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
టిక్కెట్ల కోసం ఇలా ‘పాస్'లో గందరగోళం అని ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ‘గప్పీదాస్' (అబద్ధాల కోరు) అని అభివర్ణించారు. మీడియా సృష్టించిన నాయకుడు హార్దిక్ పటేల్ అని కొట్టి పారేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో తప్పుడు గణాంకాలతో విస్త్రుత ప్రచారంచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల కల్పన పేరిట కాంగ్రెస్ పార్టీ, పాటిదార్ల అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారో కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదని విజయ్ రూపానీ గుర్తు చేశారు. ‘నాకు ‘కాంగ్రెస్ - హార్దిక్ పటేల్'కూటమి వల్ల ఒక విషయం అర్థమైంది. దీనివల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బ తినవు. వారి అసలు నిజమైన డిమాండ్ను పక్కన బెట్టి.. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం పాస్ కార్యకర్తలు బారులు తీరారు' అని ఎద్దేవా చేశారు.
ప్రగతి బాటలో గుజరాత్ అని రూపానీ ఇలా
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాటిదార్లకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారో చెప్పాలని విజయ్ రూపానీ డిమాండ్ చేశారు. ఇదే వారిద్దరి (కాంగ్రెస్ పార్టీ - హార్దిక్ పటేల్) మధ్య గల ఒప్పందాన్ని బయట పెడుతుందన్నారు. రిజర్వేషన్ల కల్పన విషయమై సుప్రీంకోర్టు 50 శాతం దాట కూడదని గుర్తు చేశారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో 22 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రగతి బాటన పయనిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 1980వ దశకంలో రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళన సందర్భంగా 100 మందికి పైగా యువకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
రిజర్వేషన్ల ఎజెండా రుజువు చేయాలని డిమాండ్
‘నేను వారిని సవాల్ చేస్తున్నా. దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులతో సంప్రదించి.. రిజర్వేషన్ల కల్పన విషయమై కాంగ్రెస్ - పాస్ మద్య కుదిరిన ఒప్పందం అమలు సాధ్యాసాద్యాలు రుజువు చేయాలి' అని విజయ్ రూపానీ అన్నారు. ఈ చర్చలోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాత్రం రావొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ, పాస్ మధ్య రిజర్వేషన్లపై అంగీకారం కుదర్చడంలో కపిల్ సిబల్ కీలక పాత్ర పోషించారు. కీలక అంశాల్లో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వ వైఖరిని కపిల్ సిబల్ నిలదీశారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ ముందు ఎటువంటి ఎజెండా లేదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. అందువల్లే తమ అభివ్రుద్ధి ఎజెండాకు వ్యతిరేకంగా ‘అభివ్రుద్ధి ఒక పిచ్చి'గా మారింది అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు. చేతనైతే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార ఎజెండా ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేశారు.
అధికారం కోసం కులాన్ని పావుగా మార్చారని ఫైర్
‘హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ అధికారం కోసం కులాన్ని ఒక పావుగా మార్చుకున్నారు. ఈ కుల సంఘాల నేతలను కాంగ్రెస్ పార్టీ ముంచేస్తుంది' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వివిధ కుల సంఘాల నేతలు మద్దతు ప్రకటించినా బీజేపీ 150కి పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘హార్దిక్, అల్పేశ్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. వారు తమ సామాజిక వర్గాల వారిని ఊగిసలాటలో పడేశారు. వారంతా మీడియా తయారుచేసిన నాయకులు. వారి ధోరణులు బయటపడ్డాయి. వారంతా కాంగ్రెస్ పార్టీ ఏజంట్లుగా పనిచేస్తున్నారు' అని విజయ్ రూపానీ మండిపడ్డారు.
బీజేపీకి గుజరాత్ ఎన్నికలు కీలకమని విజయ్ రూపానీ అంగీకారం
‘కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక గప్పీదాస్ (అబద్దాల కోరు). గుజరాత్ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఉపాధి కల్పనా కేంద్రాల్లో కేవలం ఆరు లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు' అని చెప్పారు. 13 వేల స్కూళ్లు మూతబడినా 17 వేల స్కూళ్లు ప్రారంభించామని సెలవిచ్చారు. అయితే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి చాలా ముఖ్యమని అంగీకరించారు. ప్రధాని మోదీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు 120 స్థానాల్లో గెలిపించారు. ప్రస్తుతం ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నికైన తర్వాత తమకు ప్రజలు 150 స్థానాల్లో విజయాన్ని అందించనున్నారని అన్నారు. సర్వేల్లో ఆదరణ తగ్గిందన్న వార్తలు తన ద్రుష్టికి రాలేదన్నారు.
మోదీ కేంద్రంగా బీజేపీ ప్రచారం ఇలా
కాంగ్రెస్ పార్టీ ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నదని, కానీ తమకు ప్రధాని మోదీ ప్రధాన వనరని అభిప్రాయ పడ్డారు. బీజేపీ ప్రచారం అంతా ప్రధాని మోదీ కేంద్రంగా సాగుతుందన్నారు. సీఎం అభ్యర్థిని పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేస్తుందని చెప్పారు. తాను పార్టీకి విధేయుడిగా నాయకత్వం పెట్టిన బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. గతేడాది సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తాను వివిధ వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకున్నానని, రాజ్ కోట్ స్థానం నుంచి తన విజయం తథ్యమని విజయ్ రూపానీ స్పష్టం చేశారు.