బీజేపీ వెనక్కి: మహారాష్ట్ర స్పీకర్గా కాంగ్రెస్ నేత నానా పటోలే
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రేసు నుంచి భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గింది. తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైంది.
మహారాష్ట్ర స్పీకర్ ఎన్నిక జరిగే కొద్ది గంటల ముందే.. ప్రతిపక్ష బీజేపీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ తాజా నిర్ణయంతో మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థి నానా పటోలే ఎన్నిక ఏకగ్రీవమైనట్లయింది.
కాగా, 56ఏళ్ల నానా పటోలే విదర్భ జిల్లాలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ నేతగా కొనసాగిన ఆయన ఆ పార్టీని వీడి బీజేపీ టికెట్పై 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో విబేధాల కారణంగా ఆయన 2017లో బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాగా, నానా పటోలే తమ స్పీకర్ అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నేత మాణిక్ రావు థాక్రే మీడియాకు తెలిపారు. బీజేపీకి తమ అభ్యర్థిని నిలిపే హక్కు ఉన్నప్పటికీ.. స్పీకర్ ఎన్నికకు పోటీ ఉండకూడదనే సంప్రదాయాన్ని పాటిస్తుందని అనుకుంటున్నట్లు శనివారం ఆయన చెప్పారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి శనివారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే. 288 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో 169 మంది ఎమ్మెల్యేలు ఈ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం సునాయాసంగా మెజార్టీని నిరూపించుకోగలిగింది.
శుక్రవారం ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన విషయం తెలిసిందే. అంతకుముందు బీజేపీ నియమించిన ఎమ్మెల్యే కాళీదాస్ కోలంబకర్ను తొలగించి కొత్తగా దిలీప్ వాల్సేను ప్రొటెం స్పీకర్గా ఎన్నుకోవడం గమనార్హం.