మోడీకి మాకెన్ 'కళంకిత' షాక్, సుజన రిజైన్ చేయాలని
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కళంకిత మంత్రులు ఉన్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి వర్గంలో కళంకిత మంత్రులకు చోటు ఉండకూడదని సుప్రీం కోర్టు ఆగస్టు 27న చెప్పింది. అయితే, మోడీ కేబినెట్లో కళంకిత మంత్రులు కొత్తగా చేరారని అజయ్ మాకెన్ ఆరోపించారు.
నరేంద్ర మోడీ కేబినెట్లో ఇప్పటికే ఉన్న 13 మంది మంత్రులను తొలగిస్తారని తాము భావించామని, కానీ ఆయన కళంకిత మంత్రులను ఈసారి కేబినెట్ విస్తరణలో చేర్చుకున్నారని మాకెన్ అన్నారు. మోడీజీ! స్వచ్ఛ పాలిటిక్స్ మాటేమిటని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో బీజేపీ మంత్రుల పలు కీలక శాఖలను ఒకటికి పైగా చేపట్టడాన్ని ఆయన ఎత్తి చూపారు.
కాగా, తెలుగుదేశం పార్టీ నుండి తాజాగా మంత్రి పదవి చేపట్టిన సుజనా చౌదరి పైన మాకెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. సుజన డిఫాల్టర్ అని, ఆయనకు ఎలా పదవి ఇస్తారని మోడీని ఆయన ప్రశ్నించారు. టాప్ 20 ఎన్సీఏలో సుజన ఉన్నారన్నారని తెలుస్తోంది.
మోడీ క్యాబినెట్లో కొత్తగా యోగా మంత్రిత్వ శాఖ
భారత్ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న యోగాను ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తోంది. అలాంటి యోగాను భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రమం తప్పకుండా చేస్తారు. దీని పైన ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు, వారిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంపొందించేందుకు మంత్రిత్వ శాఖగా యోగాకు ప్రముఖ స్థానం కల్పించారు.
ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆయుష్ను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా నిన్నటి క్యాబినెట్ విస్తరణలో ప్రకటించారు. ఆయుష్ పోర్ట్ ఫోలియో కింద యోగా, నేచురోపతిలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునానీ తదితర వైద్య విధానాలను చేర్చారు. యశో నాయక్ ఆయుష్ మంత్రిగా బాధ్యతలు చేపడతారు.
పారదర్శకతో పని చేస్తా: పారికర్
రక్షణ శాఖలో కొనుగోళ్లు పారదర్శకతతో వేగంగా చేస్తామని కొత్తగా రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి మనోహర్ పారికర్ సోమవారం అన్నారు. పారదర్శకతతో వేగంగా పని చేయడమే తన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుజన
కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖను కేటాయించడం పట్ల సుజనా సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పని చేస్తున్నారన్నారు.
వీరిని ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. మనదేశంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.