పొత్తులపై గందరగోళం, అయోమయంలో కాంగ్రెస్ అధిష్టానం
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. చాలా పార్టీలు పొత్తుల విషయంలో ఇప్పటికే దాదాపు ఓ క్లారిటీకి వచ్చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మాత్రం మొదటి విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులైనా ఎవరితో జట్టు కట్టాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ఢిల్లీ, బీహార్, బెంగాల్ లలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తోంది. మొదటి విడత ఎన్నికలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడానికి ఆ పార్టీ ఒంటెత్తు పోకడలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆప్ తో దోస్తీపై తొలగని సస్పెన్స్
దేశ రాజధాని ఢిల్లీలో 7 లోక్ సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి నడుస్తుందా అన్న అంశం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ లో ఒకవర్గం ఆప్ తో పొత్తుకు సయ్యంటుండగా.. మరో వర్గం ససేమిరా అంటుండటంతో కాంగ్రెస్ హై కమాండ్ అయోమయంలో పడింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమకు 5 సీట్లు కేటాయించాలని పట్టుబడుతుండటం సమస్యను మరింత జఠిలంగా మార్చింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవనార్ రంగంలోకి దిగి ఇరు పార్టీల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు ఆప్ నేతలను పొత్తుకు ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే శరద్ పవార్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకమే.
బీహార్ లో 11 సీట్లకు కాంగ్రెస్ పట్టు
బీహార్ లో మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం సైతం ఇంకా కొలిక్కిరాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల పంపకం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. 40 లోక్ సభ స్థానాలున్న బీహార్ లో వాస్తవానికి కాంగ్రెస్ బలం అంతంత మాత్రమే. అయినప్పటికీ ఆ పార్టీ తమకు 11 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. భాగస్వామ్యపక్షమైన ఆర్జేడీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఆర్జీడీ తాము 20 సీట్లలో పోటీ చేస్తామని, కాంగ్రెస్ 8సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలపాలని అంటోంది. మిగతా సీట్లకు కూటమిలోని చిన్నా పార్టీలైన రాష్ట్రీయ లోక్ సమత పార్టీ, హిందుస్తానీ అవామీ మోర్చా, శరద్ యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనతాదళ్ లకు కేటాయిద్దామని చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఆర్జేడీ ప్రతిపాదనపై తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. మరో రెండు రోజుల్లో సస్పెన్స్ కు తెరపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బెంగాల్ లో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య విబేధాలు
బెంగాల్ లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయాలనుకున్న కాంగ్రెస్ పట్టువిడుపు ధోరణిని అవలంబించకపోవడంతో పొత్తు చర్చలు దాదాపు విఫలమైనట్లు తెలుస్తోంది. బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలుండగా.. సీపీఐ(ఎం)38 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 2014లో కాంగ్రెస్ విజయం సాధించిన 4 సీట్లను మాత్రం కాంగ్రెస్ కు కేటాయించింది. కాంగ్రెస్ మాత్రం సీపీఐ(ఎం) పోటీ చేయాలనుకుంటున్న రాయ్ గంఝ్, ముర్షిదాబాద్ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ చర్యతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న లెఫ్ట్ నేతలు కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో దింపుతామని వార్నింగ్ ఇచ్చారు.
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?
యూపీలో దుందుడుకుగా వ్యవహరించిన కాంగ్రెస్
ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్డీతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే మిత్ర ధర్మాన్ని మరిచి సీట్ల సర్దుబాటు విషయంలో దుందుడుకుగా వ్యవహరించింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కేవలం 7 సీట్లు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. కాంగ్రెస్ వైఖరిని ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే ఎస్పీ, బీఎస్పీలు సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయి. 48 స్థానాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాయా అన్నది ప్రస్తుతాని మిలియన్ డాలర్ క్వశ్చన్.
మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన చర్చలు
మహారాష్ట్రలో మాత్రం ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు అంశం దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే కూటమిలోని చిన్న పార్టీలకు సీట్ల కేటాయింపుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 స్థానాల్లో పోటీ చేయాలని నేతలు నిర్ణయించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే రెండు పార్టీలు క్లారిటీకి వచ్చాయి. అయితే తమ వంతు సీట్లలో కూటమిలోని మిగతా చిన్న పార్టీలకు ఏ స్థానాలు కేటాయించాలన్న అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ సీనియర్లు అంటున్నారు.