కదుల్తున్న బస్సులో ఘోరం, ప్రయాణీకులు బాధ్యులే: కేంద్రమంత్రి పేరుపైనే!
న్యూఢిల్లీ: పంజాబ్లో కదులుతున్న బస్సులో కండక్టర్, క్లీనర్లు పైశాచికత్వానికి పాల్పడిన అంశంపై గురువారం లోకసభలో దద్దరిల్లింది. ప్రకాశ్ సింగ్ బాదల్ పైన ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సహాయంగా ముందుకు రాని తోటి ప్రయాణీకులు కూడా ఈ ఘటనకు బాధ్యులని కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు.
కాగా, లైంగిక వేధింపులను తట్టుకోలేక ఎదురుతిరిగిన కుమార్తెను, ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన తల్లిని కదులుతున్న బస్సులోంచి తోసేసిన దారుణం పంజాబ్ను కుదిపేస్తోంది. ఆ సమయంలో బస్సు వేగంగా పోతుండటంతో, కింద పడిన వెంటనే కుమార్తె చనిపోయింది.
తల్లి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పడి ఉంది. ఇంత ఘోరానికి వేదిక అయిన ప్రైవేట్ బస్సు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబ కంపెనీకి చెందినది. ఈ విషయాన్ని సీఎం బాదల్ అంగీకరించారు. అయినా ఈ అంశాన్ని వదిలిపెట్టేందుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నాయి. పోలీసులు ఇప్పటిదాకా ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు.
మొగా జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోని గిల్ గ్రామం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలిక, ఆమె తమ్ముడు, తల్లి (38) గురుద్వారాను సందర్శించుకొని ఓ ప్రైవేట్ బస్సులో తిరుగుముఖం పడ్డారు. అప్పుడు బస్సులో దాదాపు పది నుండి ఇరవై మంది ఉన్నారు. బస్సు గిల్ గ్రామం సమీపంలోకి వస్తుందనగా బాలికను ఏడిపించడం ప్రారంభించారు.
అడ్డుకోబోయిన తల్లిని దుర్భాషలాడారు. బాలికపై లైంగిక వేధింపులకు ఆకతాయిలు ప్రయత్నించగా, ఆమె గట్టిగా ఎదుర్కొంది. బిడ్డని రక్షించుకోవడానికి తల్లి కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. తమను తాము రక్షించుకోవడానికి వారు చివరిదాకా పోరాడారు. దాంతో, మరింత రెచ్చిపోయిన వారు ముందు బాలికను బస్సు కిటికీలోంచి తోసేశారు.
కింద పడటమే తల రోడ్డుకు తగలడంతో బాలిక నెత్తురుమడుగులో కొంతసేపు కొట్టుకొని ఊపిరి వదిలేసింది. కిందకు పడుతున్న బిడ్డను కాపాడుకోబోయిన తల్లిని వారు అడ్డుకొన్నారు ఆమె బస్సులోంచి బయటకు నెట్టేశారు. తమను విడిచిపెట్టమని వారు ఎంతగా వేడుకున్నా బస్సు సిబ్బంది కనికరించలేదు.
ఈ ఘటనలో పోలీసులు బస్సు కండక్టర్, క్లీనర్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. సీఎం బాదల్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ మొగా జిల్లా కేంద్రంలో ధర్నా చేసింది. లోకసభలో ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని డిమాండ్ చేసింది. ఆ బస్సు తమ కుటుంబ యాజమాన్యంలోని కంపెనీకి చెందినదేనని ప్రకాశ్ సింగ్ బాదల్ చెప్పారు.
ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కోడలు హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి. కాగా, ఈ ప్రైవేట్ బస్సును ఆర్బిట్ ఏవీయేషన్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఈ కంపెనీ సీఎం బాదల్ కోడలు, కేంద్ర మంత్రి హర్సిమ్రాత్ మాన్ బాదల్ పేరుతో రిజిస్ట్రర్ అయినట్టు చెబుతున్నారు. కాగా, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం శాఖ అధికారులను ఆదేశించింది.