కాంగ్రెస్ ఫార్ములా: సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. ఇక టికెట్ల కేటాయింపులపై ఆయా పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఒకరికి ఇస్తే మరొకరు అలకపాన్పు ఎక్కుతున్నారు. లేదా మరో పార్టీలోకి సింపుల్గా జంప్ అవుతున్నారు. దీంతో ఆయా పార్టీల అధినాయకత్వాలు ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తానికి టికెట్ కేటాయింపుల్లో ఎవరి గేమ్ వారు ఆడుతూ షోను మాత్రం రక్తి కట్టిస్తున్నారు.
గుజరాత్, కర్నాటక ఫార్ములా
టికెట్ల కేటాయింపు విషయానికొస్తే కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల సందర్భంగా అక్కడి అభ్యర్థులను ఎలాగైతే ఎంపిక చేసిందో అలాంటి ఫార్ములానే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంప్లిమెంట్ చేస్తోంది. గుజరాత్ కర్నాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పలు సంస్థలతో అభ్యర్థుల విజయావకాశాలు దృష్టిలో పెట్టుకుని సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపులు జరిపింది.
మధ్యప్రదేశ్లో మూడు సర్వేలు చేయించిన కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ మూడు అధికారిక సంస్థలతో సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఒక సర్వే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేయించగా.. మరొకటి కమల్నాథ్ చేయించారు. మరొకటి పార్టీ జనరల్ సెక్రటరీ మరియు మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ దీపక్ బవారియా చేయించారు. ఈ మూడు సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని వారు చెప్పారు. ఇక మూడు సర్వేల్లో అభ్యర్థి పేరు వస్తే ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. మూడు వివిధ సంస్థలతో సర్వేలు చేయించిన నేపథ్యంలో టికెట్ కేటాయింపు తమకు సులభతరంగా మారనున్నదని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పారు. ఈ మూడు సంస్థలు ఒకదానితో ఒకటికి సంబంధం లేవని చెప్పారు.
అంతర్జాతీయ సంస్థతో సర్వే చేయించిన రాహుల్ గాంధీ
మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులుగా ఉన్నవారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా టికెట్ కేటాయింపును పరిశీలించే అవకాశం ఉంది. టికెట్ ఫలానా అభ్యర్థులకు కేటాయించే ముందు మూడు సర్వేలతో పాటు పరిశీలకుల రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ చేయించిన సర్వే సంస్థ అంతర్జాతీయ సంస్థగా తెలుస్తోంది. గుజరాత్ కర్నాటక ఎన్నికల సందర్భంగా ఈ అంతర్జాతీయ సంస్థతోనే సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఇలా కేటాయింపులు చేయడం వల్లే పార్టీ సక్సెస్ రేట్ పెరిగిందని హస్తం నేతలు చెబుతున్నారు.
సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తే మెరుగ్గా సక్సెస్ రేట్
కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఇలాంటి పద్దతిని పాటించడం వల్ల పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్వేల ఆధారంగా వడపోత చేసి అభ్యర్థులను ఖరారు చేయడం శుభపరిణామం అని సీనియర్లు చెబుతున్నారు. అయితే ఈ సర్వేలు బయట సంస్థలతో చేయించడం ఇంకా మంచిదని అది కూడా కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేని సర్వే సంస్థలతో చేయించడం వల్ల నమ్మకం ఏర్పడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సర్వేలు వాస్తవానికి దగ్గరగా నిలుస్తున్నాయని దీని వల్ల అభ్యర్థుల ఖరారు కూడా చాలా సులభంగా జరిగిపోతోందని వెల్లడించారు. అయితే రాహుల్ గాంధీ సర్వే ఎప్పుడు చేయించారన్నది ఎవరికీ తెలియదని హస్తం నేతలు చెబుతున్నారు. 230 సీట్లున్న మధ్యప్రదేశ్లో దాదాపు సగానికి పైగా టికెట్లు సర్వేల ఆధారంగానే కేటాయించనున్నట్లు చెప్పారు.