'డీకె శివకుమార్'కి డిప్యూటీ సీఎం అడిగిన కాంగ్రెస్, 'నో' అన్న కుమారస్వామి!
బెంగళూరు: ఇక బీజేపీతో పంచాయితీ ముగిసింది. కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి. బయటినుంచి మద్దతు కాకుండా.. జేడీఎస్ తో అధికారాన్ని పంచుకోబోతుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏయే పదవులు? అన్నదానిపై ఇరు పార్టీల మధ్య చర్చ మొదలైంది.
ముందుగా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంమంత్రి పదవి ఇచ్చేందుకు జేడీఎస్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ మాత్రం డీకె శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు జేడీఎస్ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంకు బదులు విద్యుత్ శాఖను ఆయనకు కేటాయిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.
బీజేపీ విశ్వాస పరీక్ష వీగిపోయేలా చేయడంతో కాంగ్రెస్ తరుపున డీకె శివకుమార్ కీలక పాత్ర పోషించడంతో.. ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కుమారస్వామి మాత్రం అందుకు సుముఖంగా లేకపోవడంతో.. ఇరు పార్టీల మధ్య దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
ఏదేమైనా రెండు పార్టీల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ లుకలుకలు బయటపడకుండా జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీతో ఇంతలా పోరాడి నెగ్గిన తర్వాత కూడా రెండు పార్టీల మధ్య చెడిందంటే.. ప్రజల ముందు అభాసుపాలు కాక తప్పదు.