కార్పోరేట్ సంస్థలు విరాళాలిస్తే తప్పులేదు: కాంగ్రెస్, బీజేపీ వాదన
న్యూఢిల్లీ: ఓ వైపు కార్పోరేట్ రాజకీయాలు అంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటూనే.. కార్పోరేట్ వర్గాలు విరాళాలకు తాము అనుకూలమని చెబుతున్నాయి! కార్పొరేట్ సంస్థలు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడాన్ని కాంగ్రెస్, బీజేపీలు సమర్థించాయి.
ఎన్నికల సంస్కరణలపై ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మార్చి 30న జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు కార్పొరేట్ విరాళాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
స్థాపించిన మూడేళ్ల తర్వాత ఏ పారిశ్రామిక సంస్థ అయినా తన వార్షిక లాభాల్లో గరిష్ఠంగా 7.5 శాతం మొత్తాన్ని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చంటోన్న ప్రస్తుత నిబంధనను కొనసాగించాలని ఈ రెండు పార్టీలు సూచించాయి. అయితే సమావేశానికి హాజరైన బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం ఈ సంస్కృతిని తప్పుబట్టాయి.
ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఇటీవల జరిగిన విస్తృత చర్చలో ఈ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది. ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ ప్రతిపాదనలు, పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి రాజకీయ పార్టీలతో ఈసీ చర్చలు జరిపింది.
కార్పొరేట్ విరాళాలకు తాము అనుకూలమని, చెక్కుల ద్వారా విరాళాలు అందించే విధానం ఉండాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్, బీజేపీ నేత అరుణ్ సింగ్ తెలిపారు. చెక్కుల ద్వారా విరాళాలు అందించిన పక్షంలో పారదర్శకత ఉంటుందని, నగదు రూపంలో జరిగే విరాళాలు నల్లధనానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు.
అయితే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా శనివారం పదవీ విరమణ చేసిన అనంతరం హెచ్ఎస్ బ్రహ్మ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు ఇవ్వకూడదని ఎక్కువ శాతంమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. దీనికి బదులు కార్పొరేట్ విరాళాల కోసం ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ నేతృత్వంలో నేషనల్ ఎలక్టోరల్ ట్రస్టును ఏర్పాటు చేయాలని బ్రహ్మ సూచించారు.